Samantha: ఆ జాబితాలో ఉన్నందుకు గిల్టీ ఫీలయ్యా: సమంత

తాను ఓ విషయంలో గిల్టీ ఫీలయ్యానని ప్రముఖ నటి సమంత అన్నారు. హెల్త్‌ పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడారు.

Updated : 20 Feb 2024 11:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మయోసైటిస్‌ వ్యాధి నుంచి క్రమంగా కోలుకుంటున్న ప్రముఖ నటి సమంత తన అనుభవాలను అందరితో పంచుకోవడంతోపాటు దానిపై అవగాహన కలిగించేందుకు ‘టేక్‌ 20’ పేరుతో హెల్త్‌ పాడ్‌కాస్ట్‌ ప్రారంభించారు. దానికి సంబంధించిన తొలి ఎపిసోడ్‌ను సోమవారం విడుదల చేశారు. సమంత అడిగిన పలు ప్రశ్నలకు న్యూట్రీషనిస్ట్‌ అల్కేశ్‌ సమాధానాలిచ్చారు. ఎంతో రీసెర్చ్‌ చేసి, అనుభవజ్ఞుల సలహా, సూచనలతో ఈ వెల్‌నెస్‌ కంటెంట్‌ను అందిస్తున్నట్లు సమంత తెలిపారు.

సమంత: ఆటో ఇమ్యూనిటీ గురించి చెప్పండి..

అల్కేశ్‌: చాలామంది అభిప్రాయపడుతున్నట్లు ఇది వ్యాధి కాదు. వైరస్‌, బ్యాక్టీరియాల నుంచి వ్యాధినిరోధక వ్యవస్థ కాపాడుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అదే వ్యవస్థ తిరిగి మన శరీరంపై దాడి చేస్తే.. ఆటో ఇమ్యూన్‌ సమస్య.

సమంత: ఆటో ఇమ్యూన్‌ కేసులు ఎక్కువవుతున్నాయనే విషయం తెలిసి ఆశ్చర్యపోయా. ముఖ్యంగా షుగర్‌, క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులున్న వారు దీన్ని ఎదుర్కొంటున్నారు. ఎందుకు?

అల్కేశ్‌: ఆధునిక జీవనశైలిని ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తినే ఆహారం, పీల్చే గాలి, ధరించే దుస్తులు, సౌందర్యోపకరణాలు.. ఇలా ఏవైనా ప్రభావితం చేయొచ్చు. 50 ఏళ్లలో వాతావరణంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.

సమంత: ‘నేను మంచి ఆహారం తింటున్నా, ఆరోగ్యంగా ఉన్నా.. ఇలాంటివి నా దరి చేరవు’ అని కొందరు అనుకుంటారు. ఇంతకుముందు నేనూ ఈ జాబితాలో ఉన్నందుకు గిల్టీగా ఫీలయ్యా. నేనూ పొద్దునే లేచి, వర్కౌట్స్‌ చేసేదాన్ని. ఆరోగ్యకరమైన ఆహారం తినేదాన్ని. మనస్ఫూర్తిగా నవ్వేదాన్ని. తీవ్ర ఒత్తిడి కారణమంటారా?

అల్కేశ్‌: అవును. తీవ్ర ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు ఆటో ఇమ్యూన్‌కు కారకాలే. ఇలాంటి పరిస్థితుల్లో మంచి నిద్ర ఎంతో అవసరం. ఒక్కోసారి శరీరం నిద్రావస్థలో ఉన్నా మెదడు వృత్తిపర/వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తుంటుంది. అది అప్పటికి ఓకే అయినా భవిష్యత్తులో ఎఫెక్ట్‌ పడుతుంది.

సమంత: ఈ సమస్యను అధిగమించేందుకు ఏం చేయాలి?

అల్కేశ్‌: తాజా ఆహారం తినాలి. ఫిల్టర్‌ చేసిన నీరు తాగాలి. కాస్మోటిక్స్‌ తదితర వాటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని