డ్రగ్స్‌ కలకలం.. మరో సినీనటి అరెస్ట్‌

కన్నడ చిత్రసీమను డ్రగ్స్‌ తుపాను వణికిస్తోంది. ఈ క్రమంలో లోతైన విచారణ నిమిత్తం మంగళవారం నటి సంజనా గల్రానిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 27 Dec 2022 20:14 IST

కోర్టులో హాజరు పర్చనున్న పోలీసులు

బెంగళూరు: డ్రగ్స్‌ వ్యవహారం శాండిల్‌వుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసు దర్యాప్తును కేంద్ర నేర నియంత్రణ విభాగం (సీసీబీ) ముమ్మరం చేసింది. ఇప్పటికే సినీ నటి రాగిణి ద్వివేదితో పాటు మరికొందరిని అరెస్టు సీసీబీ అధికారులు.. తాజాగా మరో నటి సంజనా గల్రానీని అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం 6.30గంటల సమయంలో బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఆమె నివాసానికి వచ్చిన పోలీసులు దాదాపు నాలుగున్నర గంటల పాటు సోదాలు చేశారు. ఆమె ఇంట్లోని పూల కుండీలు, వంటగది, ఆమె గది, బాల్కనీ, కార్లలోనూ తనిఖీలు చేపట్టారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరిచి పోలీస్‌ కస్టడీకి అడుగుతామని అధికారులు తెలిపారు.

అలాగే, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వీరెన్‌ ఖన్నా అనే వ్యాపారవేత్త ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన బెంగళూరులో పెద్ద పెద్ద పార్టీలు నిర్వహిస్తుంటారు. మంగళవారం వీరిద్దరి ఇళ్లల్లో సోదాలు కోసం కోర్టునుంచి అధికారులు సెర్చ్‌ వారెంట్లు తీసుకొని రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో సంజనా సన్నిహితుడైన రాహుల్‌ థోన్సే కూడా కొద్దిరోజుల క్రితమే అరెస్టయిన విషయం తెలిసిందే. అతడితో పాటు మరికొందరు ఇచ్చిన సమాచారం ఆధారంగానే సంజన నివాసంలో సోదాలు చేసినట్టు అధికారులు తెలిపారు.

తన ఇంట్లో సోదాలు జరుగుతున్న సమయంలో కొద్ది సమయం పాటు పోలీసులకు సహకరించిన సంజన.. ఆ తర్వాత వారితో వాదనకు దిగినట్టు సమాచారం. సోదాల సమయంలోనే బ్రేక్‌ఫాస్ట్‌ బయట నుంచి అధికారులు తెప్పించినా తొలుత ఆమె తినేందుకు నిరాకరించారనీ.. ఆ తర్వాత తిన్నారని తెలిపారు. సంజన ఇంట్లో ల్యాప్‌టాప్‌, హర్డ్‌ డిస్క్‌, మూడు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే, సంజన కుటుంబ సభ్యులు, అక్కడ పనిచేసే సిబ్బందిని కూడా ప్రశ్నించారని సమాచారం. 

డ్రగ్స్‌ కేసులో ఈ నెల 4న సినీనటి రాగిణి ద్వివేదిని సీసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అదే రోజు ఉదయం ఆమె నివాసంలో సోదాలు జరిపిన అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరచగా.. మూడు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతిచ్చింది. అయితే, ఆమె పోలీసుల విచారణకు సహకరించకపోవడంతో మరో ఐదు రోజుల పాటు కస్టడీని సోమవారం పొడిగించిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని