Sonali Bendre: ఆ ఒక్క సాంగ్‌ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్‌ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు.

Updated : 25 Apr 2024 11:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ సోనాలి బింద్రే (Sonali Bendre) కొన్నేళ్ల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నారు. ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. జీ5 వేదికగా మే3 నుంచి ఇది ప్రసారం కానుంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. డ్యాన్స్‌ రాదని అందరూ విమర్శించేవారన్నారు.

‘అరవింద్‌ స్వామి, మనీషా కొయిరాల ప్రధాన పాత్రలో నటించిన ‘బొంబాయి’లో నేను ఒక పాట చేశాను. అప్పటికి ఐదు సినిమాల్లో మాత్రమే నటించిన అనుభవం. ఆ చిత్రం విడుదల తర్వాత నా కెరీర్‌ పూర్తిగా మారింది. అప్పటి వరకు నాకు డ్యాన్స్‌ రాదని అందరూ విమర్శించేవారు. ఆ పాట చూశాక వారి ధోరణి మారింది. నేను శిక్షణ పొందిన డ్యాన్సర్‌ని కాదు. అందుకే సినిమాల్లోకి వచ్చాక చాలా మంది కొరియోగ్రాఫర్స్‌తో తిట్లుతిన్నాను. అప్పట్లో డ్యాన్స్‌ రాకపోతే హీరోయిన్‌ కాలేరనే భావన బలంగా ఉండేది. అందుకే సమయం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్‌ చేసేదాన్ని. బొంబాయిలోని పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌ కావడంతో దానిని నేను సవాలుగా తీసుకున్నాను. ఈ పాటతో మెప్పించాలి లేదంటే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా’

‘మణిరత్నం లాంగ్‌ షాట్‌లకు ప్రాధాన్యమిచ్చేవారు. బొంబాయిలో ‘హమ్మా హమ్మా’ పాటలో చాలా స్టెప్స్‌ సింగిల్‌ టేక్‌లో ఓకే చేశారు. అది చూసిన కొరియోగ్రాఫర్‌ సుందరం మాస్టర్‌ మూమెంట్స్‌ బాగా చేశానని నాకు రూ.100 బహుమతిగా ఇచ్చారు. అంతగొప్ప వ్యక్తి నన్ను ప్రశంసించినందుకు చాలా సంతోషించా. మరెవ్వరి సర్టిఫికెట్‌ అవసరం లేదనిపించింది. ఇండస్ట్రీలో కొనసాగొచ్చనే ధైర్యం వచ్చింది. అందుకే ఆ పాట ఎప్పటికీ ప్రత్యేకమే. అది నా సినిమాలోని పాట కాకపోయినా నా పాటగా మారింది. మంచి గుర్తింపునిచ్చింది’ అని చెప్పారు.

ఏడేళ్ల విరామం తర్వాత సోనాలి ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’లో నటించారు. ఇప్పుడు దీని రెండో సీజన్‌ జీ5 వేదికగా ప్రసారం కానుంది. ఇందులో తన వయసుకు తగిన పాత్ర చేస్తున్నట్లు సోనాలి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని