Mahesh babu: మహేశ్‌-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?

మహేశ్‌, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది.

Published : 17 Apr 2024 00:04 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు(Mahesh babu) కథానాయకుడుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే పలు వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో న్యూస్‌ వైరల్‌ అవుతోంది. సాధారణంగా రాజమౌళి తన సినిమాలకు సంబంధించిన వివరాలను షూటింగ్‌ ముందే పంచుకుంటారు. మూవీ థీమ్‌ ఏంటి? ఎలా ఉంటుంది? చిత్రీకరణకు ఎలా ప్లాన్‌ చేశారు? వంటి విషయాలను చెబుతారు. ఈసారి వాటితో పాటు, కాన్సెప్ట్‌ టీజర్‌ను కూడా విడుదల చేస్తారని టాక్‌ నడుస్తోంది. కథ, అందులోని పాత్రల వివరాలను సంక్షిప్తంగా చెబుతారట. ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్‌ను కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఆ వీడియోను ప్రెస్‌మీట్‌ కన్నా ముందే విడుదల చేస్తారా? లేదా మరేదైనా సందర్భంగా పంచుకుంటారా? అన్న దానిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహేశ్‌ లుక్‌కు సంబంధించి ఇప్పటికే స్కెచ్‌లు పూర్తవగా, వాటిల్లో ‘ది బెస్ట్‌’ను రాజమౌళి, ఆయన టీమ్‌ సెలక్ట్‌ చేసి, ఫైనల్‌ చేయనున్నారు. ఆ వెంటనే మహేశ్‌తో లుక్‌ టెస్ట్‌ చేసి, మూవీకి సంబంధించిన లుక్‌ను లాక్‌ చేయనున్నారు. మరోవైపు సినిమాకు సంబంధించి కీలక పాత్రల్లో కనిపించే నటీనటుల కోసం వేట కొనసాగుతోంది. భారీ బడ్జెట్‌తో తీయబోయే ఈ మూవీలో వివిధ భాషా నటులు నటించనున్నారు. ఈ క్రమంలో కథకు అనుగుణంగా సరిపోయే వారి కోసం చిత్రబృందం అన్వేషణ మొదలుపెట్టింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ఒకరిద్దరు ముఖ్య నటులకు స్క్రిప్ట్‌ కూడా వినిపించినట్లు టాక్‌. దీనిపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మహేశ్‌ కూడా దూకుడు పెంచారు..

మహేశ్‌ బ్రాండింగ్‌ చేయనున్న ప్రకటనలకు సంబంధించి షూటింగ్‌లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయన పలు ప్రకటనల్లో కనిపించారు. ఇటీవల కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఫ్యామిలీ ఇండియాకు తిరిగి వచ్చినా మహేశ్‌ ఇంకా విదేశాల్లోనే ఉన్నారు. సినిమాకు సంబంధించిన కొన్ని అంశాలపై శిక్షణ తీసుకుంటున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. అక్కడినుంచి రాగానే మిగిలిన యాడ్స్‌ను కూడా పూర్తి చేసి, రాజమౌళి సినిమాకు పూర్తిగా సన్నద్ధం కానున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని