Sudheer babu: నటుడిగా అంత స్వార్థంగా ఉండకూడదని తెలుసుకున్నా

‘‘సరైన సమయంలో సరైన ప్రయత్నం చేశాననే తృప్తినిచ్చిన చిత్రమిది’’ అన్నారు సుధీర్‌బాబు. తొలి నుంచీ వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తున్న కథానాయకుడీయన.

Updated : 05 Oct 2023 13:55 IST

‘‘సరైన సమయంలో సరైన ప్రయత్నం చేశాననే తృప్తినిచ్చిన చిత్రమిది’’ అన్నారు సుధీర్‌బాబు. తొలి నుంచీ వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తున్న కథానాయకుడీయన. ఇటీవల త్రిపాత్రాభినయంతో ‘మామా మశ్చీంద్ర’ చేశారు. హర్షవర్ధన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్మోహన్‌రావు నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం సుధీర్‌బాబు హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

తొలిసారి త్రిపాత్రాభినయం చేశారు. ఆ అనుభవాల్ని పంచుకుంటారా?

మానసికంగా, శారీరకంగా చాలా సవాళ్లే ఎదురయ్యాయి. నన్నెక్కువగా ఆకర్షించిన విషయం కూడా త్రిపాత్రాభినయమే. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ మొదలుకొని నా కెరీర్‌లో క్లిష్టమైన పాత్రల్ని కొన్నింటిని చేశా. దాంతో నేను కొత్తగా ప్రయత్నిస్తాననే ఓ బలమైన నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అందుకు తగ్గట్టే రూపొందిన చిత్రమిది.  వాణిజ్య ప్రధానంగా సాగే ఈ సినిమాలో బలమైన కథ కూడా ఉంది.  

ఏ పాత్ర ఎక్కువ సవాళ్లని విసిరింది?

ఒక సినిమాలో మూడు పాత్రలు చేస్తున్నప్పుడు ఏదీ ఒకదానికొకటి దగ్గరగా ఉండకూడదు. అలాంటప్పుడు చాలా జాగ్రత్తలు తీసకుని నటించాల్సి ఉంటుంది. మొదట కథ విన్నప్పుడు పరశురామ్‌, దుర్గ పాత్రల కోసం కష్టపడితే... సిక్స్‌ ప్యాక్‌తో కనిపించే మూడో పాత్రని అవలీలగా చేస్తాననుకున్నా. తీరా ఆ రెండు పాత్రలు చేశాక మూడో పాత్రే ఎక్కువగా కష్టం అనిపించింది. 120 కేజీల బరువుతో కనిపించే పాత్ర కోసం నిజంగానే అంత బరువు పెరగాలనుకున్నా. ఇదే విషయం మహేశ్‌తో చెప్పినప్పుడు.. ఉన్నట్టుండి అంత బరువు పెరగడం మంచిది కాదని చెప్పాడు. ఇంకా చాలా మంది సన్నిహితులు వద్దని వారించారు. దాంతో ప్రొస్థెటిక్‌ మేకప్‌తో ఆ పాత్రని చేశా. పాత్రలకి తగ్గట్టుగానే రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర యాసల్లో సంభాషణలు చెప్పా. నిజానికి నాకు ఈ మూడు యాసలూ కొత్తే. నాకు అలవాటైన యాసలోనూ ఓ పాత్రకి డబ్బింగ్‌ చెప్పా. ఇలా అన్ని కోణాల్లో ఈ సినిమా సవాళ్లు విసిరించింది.

సూపర్‌స్టార్‌ కృష్ణ  కోసం ఓ పాత్ర రాశారట కదా. ఆయనకి ఈ కథ చెప్పారా?

స్క్రిప్ట్‌ దశలో ఉన్నప్పుడు అనుకున్నాం.  అప్పటికే కృష్ణగారు సినిమాలు చేయడం ఆపేశారు. కానీ ఆయన్ని ఎలాగైనా ఒప్పించగలనని, కుదిరితే ఆ సన్నివేశాల్ని ఇంట్లోనే చిత్రీకరణ చేసేలా ప్లాన్‌ చేశాం. కానీ చేయలేకపోయాం. ఆయన లేకపోతే ఆ సన్నివేశానికి అంత ప్రాధాన్యం ఉండదు. అందుకే  ఆ సన్నివేశాలు తీయలేదు. ప్రతి సినిమా విడుదల రోజు మామగారితో మాట్లాడేవరకూ ఎవరి కాల్స్‌ని తీసేవాణ్ని కాదు. మా సినిమాలు ఎలా ఉన్నాయో ఆయన చెప్పాకే మిగతావాళ్ల అభిప్రాయాలు తెలుసుకునేవాళ్లం. మా జీవితాల్లో ఆయన లేని లోటు  ఎవ్వరూ తీర్చలేరు.

సూపర్‌స్టార్‌ కృష్ణ బయోపిక్‌లో నటించే అవకాశం  వస్తే మీరు సిద్ధమేనా?

నాకు ఆ అవకాశం వస్తే అదరగొడతా. సూపర్‌స్టార్‌ బయోపిక్‌ చేస్తే నా కెరీర్‌కి ఉపయోగపడుతుందనో లేదంటే ఆయన మామగారు అనో ఆసక్తి చూపడం లేదు. బయోపిక్‌ చేస్తున్నప్పుడు ఆ కథ తాలూకు ఆత్మని పట్టుకోవడం ముఖ్యం. కృష్ణగారు నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన జీవితంలో ఎత్తు పల్లాల గురించి, సంఘర్షణ గురించి తెలుసు. బయోపిక్‌ అంటే... వాళ్లలా నడిస్తేనో, వాళ్లలా హావభావాలు ప్రదర్శిస్తేనో అయిపోదు. సినిమాకి అది అలంకరణ మాత్రమే. అసలు విషయం ఆత్మే. అందుకే కృష్ణగారి బయోపిక్‌ అవకాశంపై ఆత్రుతగా ఉన్నా.

కథల ఎంపిక పరంగా ఇప్పుడు  మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?

నటుడిగా నేను స్వార్థంగా ఉండకూడదని నిర్ణయించుకున్నా. ఇదివరకు కొత్తదంటే పరిగెత్తేవాణ్ని.  కానీ అది ప్రేక్షకులకు నచ్చుతుందా  లేదా అని ఆలోచించాలని ‘హంట్‌’ తర్వాత అర్థం చేసుకున్నా. ఓ సినిమా చేస్తే అది కొత్తగా ఉండాలి, అదే సమయంలో అందరినీ సంతృప్తి పరిచేలా ఉండాలనుకుంటా.

పుల్లెల గోపీచంద్‌ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది?

ఆ సినిమా కచ్చితంగా ఉంటుంది. కానీ అంతకంటే ముందు నా సినిమాలు మూడు విడుదలవుతాయి. ఇదివరకు వేరే నిర్మాణ సంస్థ దగ్గర హక్కులు ఉండేవి. ఇప్పుడు మరో నిర్మాణ సంస్థ వాటిని సొంతం చేసుకుంది. క్రీడాకారుడిగా గోపీచంద్‌, కోచ్‌గా గోపీచంద్‌ ఇలా రెండు భాగాలుగా తీయాలనుకున్నాం. ఆ తర్వాత ఆ నిర్ణయం మారింది. ఇలా స్క్రిప్ట్‌ దశలో ఉంది ఆ చిత్రం. తదుపరి నా చిత్రం ‘మా నాన్న సూపర్‌హీరో’ విడుదలవుతుంది. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ‘హరోం హర’ అనే మరో సినిమా చేస్తున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని