Telugu cinema: ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది

‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌.

Updated : 20 May 2024 06:42 IST

దర్శకుల దినోత్సవంలో అల్లు అర్జున్‌ 

‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దర్శకుల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు దర్శకులు పాల్గొని, ఉత్సాహంగా ఆడిపాడారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘పనిలో క్షణం తీరిక లేకుండా ఉండే దర్శకులు తమలో ఐక్యత ఉండాలనే ఉద్దేశంతో ఒక్కచోటికి చేరి, ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. ప్రతి ఏడాదీ వేడుకని ఇంతే ఉత్సాహంగా జరుపుకోవాలి. ఈ స్ఫూర్తితో సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌లలోని వివిధ విభాగాలు కూడా ముందుకొచ్చి వేడుకలు నిర్వహించుకోవాలి. దానికి నా తరఫు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది’ అన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని దర్శకులు దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నామని ప్రకటించినప్పుడు తనకెంతో సంతోషం కలిగిందన్నారు. ఈ సందర్భంగా దాసరితో తమకున్న అవినాభావ సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకలో దర్శకులు అనిల్‌ రావిపూడి, శ్రీరామ్‌ ఆదిత్య, శైలేష్‌ కొలను, శివ నిర్వాణలాంటి యువ దర్శకులు తమ స్టెప్పులతో అభిమానులను అలరించారు. అనంతరం.. జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్‌కు దర్శకుల సంఘం తరఫున ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, విజయేంద్రప్రసాద్, మురళీమోహన్, శ్యామలాదేవి, నాని, అల్లరి నరేష్, అడవి శేష్, ఆనంద్‌ దేవరకొండ, సుధీర్‌బాబు, కార్తికేయ, రమేష్‌ ప్రసాద్, హరీష్‌శంకర్, వంశీ పైడిపల్లి, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్‌.శంకర్, మెహర్‌ రమేష్, వెల్దండి వేణు, చంద్రమహేష్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మారుతి, వశిష్ఠ, అంబికాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.    

న్యూస్‌టుడే, నారాయణగూడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు