Trivikram: పుస్తకం ఎందుకు చదవాలంటే.. త్రివిక్రమ్‌ మాటల్లో..!

దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. పుస్తకం చదవడం ఎంత ఉపయోగమో చెప్పారు.

Updated : 02 Dec 2023 12:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram Srinivas) సినిమాల్లోని డైలాగులు ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంటాయి. అలాగే ఆలోచింపచేసేలా ఉంటాయనడంలో సందేహం లేదు. అందుకే అభిమానులందరూ ఆయన్ని మాటల మాంత్రికుడని పిలుచుకుంటారు. సినిమా వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాల్లో వేదికలపై ఆయన ఇచ్చే స్పీచ్‌కు కూడా చాలా మంది అభిమానులుంటారు. సోషల్ మీడియాలోనూ ఆయన మాటలు తెగ షేర్‌ అవుతూ ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడల్లా పుస్తకం గొప్పతనాన్ని చెప్పే త్రివిక్రమ్‌ మరోసారి తన మాటలతో ఆకట్టుకున్నారు. తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పుస్తకం ఎందుకు చదవాలో చెప్పారు.

పుస్తకం చదవడం వల్ల మనిషిలో ఎంతో మార్పు వస్తుందన్న త్రివిక్రమ్‌ (Trivikram).. ‘‘టెక్నాలజీతో పాటు ముందుకు వెళ్లాలని.. పుస్తకాలు చదివితే మనం వెనక్కు వెళ్తామని అందరూ అనుకుంటారు. కానీ, అది నా దృష్టిలో తప్పు. మనం ఏదైనా చూసేటప్పుడు, వినేటప్పుడు పక్కవాళ్లతో మాట్లాడతాం. అదే.. పుస్తకం చదివేటప్పుడు మాత్రం పక్కవాళ్లతో మాట్లాడడానికి కుదరదు. అప్పుడు మనతో మనమే మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకోవడం నేటి తరానికి చాలా అవసరం. అప్పుడే మన అభిప్రాయాలను వ్యక్తపరిచే విధానంలో మార్పు వస్తుంది. అవతలి వారు నొచ్చుకోకుండా మాట్లాడగలుగుతాం. సోషల్‌ మీడియాలో చాలామంది అవతలి వారిని బాధపెట్టేలా కామెంట్స్‌ చేస్తుంటారు. ఆ విషయం కామెంట్‌ చేసిన వాళ్లే తెలుసుకోలేకపోతున్నారు. అలా ఎందుకు జరుగుతుందంటే.. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించే లక్షణం మనుషుల్లో తగ్గిపోయింది. చదవడం వల్ల ఆ ఆలోచన పెరుగుతుంది. అప్పుడు మనం ఉన్నతమైన వ్యక్తిగా మారతాం. నేను చదివిన చాలా పుస్తకాలు నాలో మార్పు తీసుకువచ్చాయి. పుస్తకాన్ని మించిన ఉలి మరొకటి ఉండదు. రాయిలాంటి మనిషిని కూడా పుస్తకం శిల్పంలా మారుస్తుంది. చదవడం అన్ని తరాలవాళ్లు అలవాటు చేసుకోవాలి’ అంటూ పుస్తకం గొప్పతనాన్ని చెప్పారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్‌ ‘గుంటూరు కారం’ (Guntur karam) తీస్తున్నారు. మహేశ్‌బాబు హీరోగా నటిస్తోన్న ఇందులో శ్రీలీల కథానాయిక. సంక్రాంతి సందర్భంగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఇందులో నటీనటుల లుక్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే తొలిపాట కూడా నెట్టింట ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు