Ram Charan: సుజీత్‌ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదు..?: ఆనంద్‌ మహీంద్రాకు రామ్‌చరణ్‌ పోస్ట్‌

నటుడు రామ్‌చరణ్‌, మహీంద్రా గ్రూప్ యజమాని ఆనంద్ మహీంద్రా మధ్య ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ఓ సరదా సంభాషణ జరిగింది. ప్రస్తుతం ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

Updated : 24 Mar 2024 11:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan), మహీంద్రా గ్రూప్ యజమాని ఆనంద్ మహీంద్రా మధ్య తాజాగా ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా సరదా సంభాషణ జరిగింది. ‘‘సుజీత్‌ పెళ్లికి నన్ను ఎందుకు ఆహ్వానించలేదు’’ అని చరణ్‌ ప్రశ్నించగా..  ‘‘గందరగోళంలో పడి మర్చిపోయా’’ అని మహీంద్రా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టులు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఈ సుజీత్‌ ఎవరంటే..?

2040 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారడమే మహీంద్రా లక్ష్యమని పేర్కొంటూ ఆ సంస్థ తాజాగా ఓ వాణిజ్య ప్రకటన విడుదల చేసింది. కొన్నేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్‌లో మహీంద్రా ప్యాక్టరీ నిర్మించడమే కాకుండా లక్షలాది చెట్లు కూడా నాటారని.. రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్స్‌ కూడా నిర్మించారని ఆ వీడియోలో పేర్కొన్నారు. దాని వల్ల అండర్‌గ్రౌండ్‌ వాటర్‌ లెవల్‌ 400 అడుగులు పెరిగిందని.. నీటి ఎద్దడి కారణంగా బ్రహ్మచారిగా ఉన్న సుజీత్‌కు పెళ్లి ఫిక్స్‌ అయ్యిందని తెలిపారు. దీనిపై రామ్‌చరణ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వీడియో షేర్‌ చేస్తూ.. ‘‘ఆనంద్‌ మహీంద్రా.. సుజీత్‌ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదు? జహీరాబాద్‌ దగ్గర్లోనే నేను ఉండేది. ఆ ప్రాంతంలో నా స్నేహితులను సరదాగా కలిసేవాడిని. ఏది ఏమైనా ఇది గ్రేట్‌ వర్క్‌’’ అని పోస్ట్‌ పెట్టారు.

దీనిపై మహీంద్రా స్పందించారు. ‘‘నేను అంగీకరిస్తున్నా. గందర గోళానికి గురయ్యా. నీకు ఆహ్వానం పంపించడం మర్చిపోయా చరణ్‌. మీ శిక్షణ ఆధారంగా నా డ్యాన్స్‌ను మెరుగుపరుచుకునే పనిలో నిమగ్నమయ్యా. మా ప్రకటన పట్ల స్పందించి ప్రశంసలు కురిపించినందుకు ధన్యవాదాలు. ఇదెంతో సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నా. నేను మరోసారి మిస్‌ కావాలని అనుకోవడం లేదు. అందుకే ఇప్పుడే చెబుతున్నా. హ్యాపీ బర్త్‌డే ఇన్‌ అడ్వాన్స్‌’’ అని రిప్లై ఇచ్చారు. ‘‘త్వరలోనే మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నా. మీ అభినందనలకు ధన్యవాదాలు’’ అని చరణ్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని