Bhatti Vikramarka: గత ప్రభుత్వం ప్రతి శాఖనూ అప్పుల్లో ముంచింది: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

గత ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు కోసం భారీగా అప్పులు చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Published : 30 Dec 2023 15:05 IST

భద్రాచలం: గత ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు కోసం భారీగా అప్పులు చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ప్రస్తుతం విద్యుత్‌ కొనుగోలు కింద రూ.59,580 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విద్యుత్‌ శాఖను పీకల్లోతు అప్పుల్లో ముంచి వెళ్లారని వ్యాఖ్యానించారు. భద్రాచలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు.

‘‘గత ప్రభుత్వం ప్రతి శాఖనూ అప్పుల్లో ముంచింది. భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌, యాదాద్రి పవర్‌ స్టేషన్‌ పెడుతున్నామంటూ భారీగా అప్పులు చేశారు. ఈ రాష్ట్రాన్ని అత్యంత ప్రమాదకరమైన, భయంకరమైన పరిస్థితికి తీసుకొచ్చారు. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేసి కొంత మేర వాస్తవ విషయాలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నం చేశాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రణాళికాబద్ధంగా, ముందు చూపుతో అడుగులు వేయాల్సి ఉంది. ఒక్క రోజు కూడా వృథా చేయకుండా ప్రతి శాఖలోని పరిస్థితులపై సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. కేవలం రాజధాని హైదరాబాద్‌లోనే ఉండకుండా.. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పరిస్థితులను సమీక్షిస్తున్నాం. వీలైనంత మేరకు వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సరైన దారిలో తీసుకెళ్లేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని భట్టి విక్రమార్క వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని