Exit Polls: బెంగాల్‌లో భాజపాదే పైచేయి.. ఒడిశాలో నవీన్‌కు షాక్‌..!

ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, దిల్లీ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్డీయే హవా కొనసాగుతుందని మెజార్టీ సర్వే సంస్థలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్‌, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ కమలదళం సత్తా చాటే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.

Published : 02 Jun 2024 00:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భాజపా (BJP) నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమే కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపడుతుందని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నాయి. కనిష్ఠంగా 281, గరిష్ఠంగా 392 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, దిల్లీ వంటి రాష్ట్రాల్లో ఎన్డీయే హవా కొనసాగుతోందని తెలిపాయి. పశ్చిమ బెంగాల్‌, ఒడిశాల్లోనూ కమలదళం సత్తా చాటుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. కర్ణాటకలో భాజపా, తమిళనాడులో ‘ఇండియా’ కూటమి (INDIA Bloc)లు తమ పట్టు నిలుపుకొంటాయని ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit Polls)లో వెల్లడైంది. కేరళ, తమిళనాడుల్లో కాషాయ పార్టీ ఖాతా తెరిచే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే.. రాజస్థాన్‌, బిహార్‌, హరియాణాల్లో మాత్రం కొన్ని సీట్లు కోల్పోతుందని చెప్పాయి.

బెంగాల్‌లో మరింత మెరుగ్గా..!

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ అవినీతి, సందేశ్‌ఖాళీ అకృత్యాలు, ఓటుబ్యాంకు రాజకీయాలే విమర్శనాస్త్రాలుగా దూసుకెళ్లిన భాజపా.. ఈ ఎన్నికల్లో మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయని మెజార్టీ సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో 42 స్థానాల్లో 18 సీట్లు గెలుచుకున్న కమలదళం.. ఈసారి మరిన్ని సీట్లు కైవసం చేసుకుంటుందని అంచనా. భాజపాకు 21-26, టీఎంసీకి 16-18 వరకు సీట్లు వస్తాయని జన్‌కీ బాత్‌ తెలిపింది. రిపబ్లిక్‌ భారత్‌- మ్యాట్రిజ్‌ 21-25, 16-20 సీట్లుగా పేర్కొంది. ఇండియా న్యూస్‌-డీ-డైనమిక్స్‌ భాజపాకు 21, టీఎంసీకి 19 వస్తాయని చెప్పింది.

కర్ణాటకలో కమలానిదే పైచేయి..

కర్ణాటకలో మరోసారి భాజపాదే పైచేయి కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం ఎదురైనప్పటికీ.. లోక్‌సభ పోరులో ఓటర్లు కమలదళానికే పట్టం కట్టినట్లు సర్వేల్లో వెల్లడవుతోంది. రాష్ట్రంలో మొత్తం 28 సీట్లు ఉన్నాయి. చాలావరకు సర్వేలు ఎన్డీయేకు 20-26 మధ్య వస్తాయని అంచనావేశాయి. కాంగ్రెస్‌ 3-7 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొన్నాయి.

ఒడిశాలో నవీన్‌కు షాక్‌..!

లోక్‌సభ ఫలితాల్లో ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌కు షాక్‌ తగిలే అవకాశం ఉందని మెజార్టీ సర్వేలు చెబుతున్నాయి. మొత్తం 21 స్థానాల్లో భాజపా 13-18 సీట్లు గెలుస్తుందని వెల్లడైంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటిన బిజూ జనతాదళ్‌.. ఈసారి 3-8 సీట్లకే పరిమితమవుతుందని వెల్లడైంది. ‘జన్‌కీ బాత్‌’ కమలం పార్టీకి 15-18, బీజేడీకి 3-7, ‘ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌’ 15-17, 4-6 సీట్లు, ‘న్యూస్‌ 24-టుడేస్‌ చాణక్య’ భాజపాకు 16, బీజేడీకి 4 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

తమిళనాడు ‘ఇండియా’దే..

39 స్థానాలు ఉన్న తమిళనాడులో డీఎంకే- కాంగ్రెస్‌ కూటమిదే పైచేయి అని సర్వేలు చెబుతున్నాయి. 28- 38 వరకు సీట్లు వస్తాయని వెల్లడించాయి. రాష్ట్రంలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోన్న కమలదళం.. ఈ ఎన్నికల్లో మరో తొమ్మిది ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపింది. ఈ క్రమంలోనే ఎన్డీయేకు 1-5 సీట్లు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఒంటరిగా పోటీ చేస్తోన్న ఏఐఏడీఎం 1-2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సమాచారం.

కేరళలో యూడీఎఫ్‌ జోరు..

కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్‌) మరోసారి కేరళను క్లీన్ స్వీప్ చేయనుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఎన్డీయే కూటమి తొలిసారి ఇక్కడ బోణి కొట్టనుందని సర్వేలు చెబుతున్నాయి. మొత్తం 20 స్థానాల్లో యూడీఎఫ్‌కు 15-18, ఎన్డీయేకు 1-3, అధికార ఎల్డీఎఫ్‌కు 0-4 వస్తాయని తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని