Komatireddy: జూన్‌ 5 తర్వాత భారాస దుకాణం మూతపడుతుంది: మంత్రి కోమటిరెడ్డి

జూన్‌ 5 తర్వాత భారాస దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

Updated : 23 May 2024 13:08 IST

హైదరాబాద్‌: జూన్‌ 5 తర్వాత భారాస దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం భారాస నేతలను ఆ పార్టీ కార్యకర్తలే వెంటపడి కొడతారన్నారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్ర సంపదనంతా దోచుకున్నది చాలక కేసీఆర్‌ కుటుంబం దిల్లీకి వెళ్లింది. అవినీతి చేయకుండానే భారాస ఎమ్మెల్సీ కవితపై 8 వేల పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేశారా?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అప్పుల ఖజానా మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు.

 ‘‘జిల్లాల్లో మున్సిపాలిటీల అనుమతులు లేకుండానే భారాస కార్యాలయాలు నిర్మించారు. ప్రభుత్వ ఆస్పత్రుల భవనాలు 14 అంతస్తులు మించరాదని నిబంధనలు చెబుతున్నాయి. ఎల్బీనగర్‌ ఆస్పత్రి స్థలానికి ఎన్‌వోసీ లేకుండా నిర్మాణం చేపట్టారు. అందెశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలని గత ప్రభుత్వాన్ని కోరాం. ఆడిటోరియానికి కాళోజీ పేరు పెట్టాలంటే పెట్టలేదు. నల్గొండ జిల్లాకు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం మంజూరు చేయిస్తే.. భారాస ప్రభుత్వం నిలిపివేసింది’’ అని విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను ప్రాధాన్య క్రమంలో నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని, వేసవిలో వడగళ్ల వాన కారణంగా పంటనష్టం జరిగితే రైతులకు రూ.1500 కోట్ల పరిహారం చెల్లించినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని