Bypolls results: నాలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాలు ఇలా.. !

దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ ఫలితాల సరళిని పరిశీలిస్తే..

Updated : 13 May 2023 20:26 IST

దిల్లీ: దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఒక లోక్‌సభ స్థానం, నాలుగు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నిక(Bypoll)ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మేఘాలయ మినహా పంజాబ్‌, ఒడిశా, యూపీలలో పలు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీలు/వాటి మిత్రపక్షాలకు చెందిన అభ్యర్థులే విజయ సాధించారు. ఉప ఎన్నికల ఫలితాలు ఇలా..

  • పంజాబ్‌లోని జలంధర్‌ లోక్‌సభ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో ఆప్‌ విజయం సాధించింది. ఆప్‌ అభ్యర్థి సుశీల్‌ కుమార్ రింకూ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన కరంజిత్‌ చౌధురిపై గెలుపొందారు. రింకూకు 3,02,097 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి కరంజిత్‌ కౌర్‌ చౌధురి 2,43,450 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇకపోతే, భాజపా అభ్యర్థి ఇందర్‌ ఇక్బాల్ సింగ్‌ అట్వాల్‌కు 1,34,706 ఓట్లు వచ్చాయి. కరంజిత్‌ కౌర్‌ భర్త, కాంగ్రెస్‌ ఎంపీ సంతోష్‌ సింగ్‌ చౌధురి జనవరిలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
  • ఒడిశాలోని ఝూర్సుగుడలో బిజు జనతాదళ్‌ తన సీటు నిలబెట్టుకుంది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి దీపాలీ దాస్‌ భాజపా అభ్యర్థిపై 48,721 ఓట్ల మెజార్టీతో  గెలుపొందారు. ఆమెకు 1,07,198 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి, భాజపాకు చెందిన టంకాధర్‌ త్రిపాఠి 58,477 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తరుణ్‌ పాండేకు కేవలం 4,496 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీపాలీ దాస్‌ ఒడిశా ఆరోగ్యమంత్రి నబ కిశోర్‌ దాస్‌ కుమార్తె. జనవరిలో ఓ పోలీసు అధికారి జరిపిన కాల్పుల్లో నబ కిశోర్‌ మృతిచెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటు నుంచి నబకిశోర్‌ దాస్‌ 45,740 ఓట్లు తేడాతో విజయం సాధించారు.
  • ఇకపోతే, యూపీలోని రెండు సీట్లలో ఉప ఎన్నిక జరగ్గా అధికార భాజపా మిత్రపక్షం అప్నాదళ్‌ (సోనేలాల్‌) కైవసం చేసుకుంది. మీర్జాపూర్‌ జిల్లాలోని ఛాన్‌బే స్థానంలో అప్నాదళ్‌(ఎస్‌) అభ్యర్థి రింకీ కోల్‌ విజయం సాధించారు.  సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన కృతి కోల్‌పై సుమారు 9వేల ఓట్ల మెజార్టీ సాధించారు. మరోవైపు, స్వార్‌లోనూ అప్నాదళ్‌ (ఎస్‌) అభ్యర్థి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి అనురాధ చౌహాన్‌పై 8,724 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఛాన్‌బేలో అప్నాదళ్‌(ఎస్‌) ఎమ్మెల్యే రాహుల్‌ ప్రకాశ్‌ కోల్‌ ఫిబ్రవరిలో మరణించడంతో ఆ సీటు ఖాళీగా ఉండగా.. సమాజ్‌వాదీ పార్టీ నేత అజంఖాన్‌ తనయుడు అబ్దుల్లా అజంఖాన్‌కు మొరాదాబాద్‌ న్యాయస్థానం 15 ఏళ్ల క్రితం నాటి కేసులో రెండేళ్ల పాటు జైలుశిక్ష విధించడంతో ఫిబ్రవరిలో అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు స్థానాలకు ఈ నెల 10న ఉప ఎన్నిక జరగ్గా.. అప్నాదళ్‌(ఎస్‌) విజయం సాధించింది.
  • మరోవైపు, మేఘాలయలో సోహియాంగ్‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఎన్‌పీపీకి యూడీపీ షాక్‌ ఇచ్చింది. ఇక్కడ యూడీపీ అభ్యర్థి స్నిహర్‌ కుపార్‌ రాయ్‌ తాబా విజయం సాధించారు. తన ప్రత్యర్థి ఎన్‌పీపీకి చెందిన అభ్యర్థిపై 3400 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఫిబ్రవరిలో మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. యూడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన హెచ్‌డీఆర్‌ లింగ్డో పోలింగ్‌కు ముందు మృతిచెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. తాజాగా అక్కడ ఈ నెల 10న ఉప ఎన్నిక నిర్వహించగా.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని