Chandrababu: ఉద్యోగాల భర్తీపై వైకాపా ఎప్పుడైనా శ్రద్ధ పెట్టిందా?: చంద్రబాబు

వైకాపాలో తిరుగుబాటు మొదలైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పారు. 

Updated : 29 Jan 2024 15:59 IST

రాజమహేంద్రవరం: వైకాపాలో తిరుగుబాటు మొదలైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పారు.  రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘ రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘ ఎన్నికలు అయిపోగానే వైకాపా ఖాళీ అవుతుంది. నడిరోడ్డుపై మహిళలను ఆ పార్టీ నేతలు వేధిస్తున్నారు. వారి జోలికి వస్తే వైకాపాకి అదే చివరి రోజవుతుంది. ప్రజల కోసం వారి మాటలు భరిస్తున్నాం. మాచర్లలో దుర్గారావు అనే కార్యకర్తను పోలీసులు వేధించారు. ఉన్మాది పాలనలో అందరం బాధితులమే’’ అని చంద్రబాబు అన్నారు.

వైకాపాను గద్దె దించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ఐదేళ్లలో ఉద్యోగ ఖాళీల భర్తీపై ఏనాడూ శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు. ‘‘ఉద్యోగం అడిగితే గంజాయి ఇస్తున్నారు. ఆకు కూరలు దొరకడం లేదు గానీ, రాష్ట్రమంతా గంజాయి దొరుకుతోంది. దానికి బానిసల్ని చేసి యువత భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారు. సంస్కరణలకు నాందిపలికిన పార్టీ తెదేపా. ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చాం. వైకాపా ప్రభుత్వంలో 9 సార్లు ఛార్జీలు పెంచారు. పన్నుల బాదుడుతో పేదల రక్తాన్ని తాగుతున్నారు’’ అని విమర్శించారు.

‘‘జగన్‌ చెప్పేవన్నీ నీతులు.. చేసేవన్నీ సైకో పనులు. దళితులెవరూ నోరెత్తకూడదు. ప్రశ్నించకూడదు. వారు స్వరం వినిపిస్తే గొంతు నొక్కేస్తారు, చంపేస్తారు. నాలుగున్నరేళ్లలో 6వేల దాడులు చేశారు. 188 మందిని పొట్టన పెట్టుకున్నారు. మాస్క్‌ అడిగిన సుధాకర్‌ను పిచ్చోణ్ని చేసి చంపారు. బాబాయిని చంపిన అవినాష్‌రెడ్డి మాత్రం రోడ్డుపై తిరుగుతున్నారు. కోడికత్తి శ్రీను ఐదేళ్ల నుంచి జైలులో ఉన్నారు. సామాజిక న్యాయమంటే ఇదేనా’’ అని చంద్రబాబు మండిపడ్డారు. ఆ పార్టీని భూస్థాపితం చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని