Chandrababu: నన్ను అంతమొందించేందుకు కుట్ర: ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ

ఏసీబీ కోర్టు జడ్జికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ పంపారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన 3 పేజీల లేఖ రాశారు. ఈ నెల 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా జడ్జికి పంపారు. 

Updated : 27 Oct 2023 12:43 IST

విజయవాడ: ఏసీబీ కోర్టు జడ్జికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ పంపారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన 3 పేజీల లేఖ రాశారు. ఈ నెల 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా జడ్జికి పంపారు. తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని అందులో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కుట్రపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చిందని.. దానిపై ఇప్పటి వరకు పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు. దీంతో పాటు మరికొన్ని అంశాలను జడ్జి దృష్టికి తీసుకెళ్లారు.  

చంపేందుకు రూ.కోట్లు చేతులు మారినట్లు తెలిసింది..

‘‘నేను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారు. ఆ ఫుటేజీని పోలీసులే లీక్‌ చేశారు. నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజీని రిలీజ్‌ చేశారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. భద్రతపై నా భయాలను గాలికొదిలేశారు. నా ప్రాణాలకు హాని ఉందని ఎస్పీకి అజ్ఞాత లేఖ వచ్చింది. వామపక్ష తీవ్రవాదులు నా హత్యకు ప్లాన్‌ చేస్తున్నట్లు లేఖలో ఉంది. నన్ను చంపేందుకు రూ.కోట్లు చేతులు మారినట్లు తెలిసింది. అజ్ఞాత లేఖపై పోలీసులు ఎలాంటి విచారణ చేయలేదు. అనుకోని ఘటన నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

పెన్‌ కెమెరాతో డ్రగ్స్‌ కేసు నిందితుడు..

జైల్లో డ్రగ్స్‌ కేసు నిందితుడు పెన్‌ కెమెరాతో తిరుగుతున్నాడు. ఆ ఖైదీ జైలు లోపల ఫొటోలు తీస్తున్నాడు.  ఈనెల 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్‌ ఎగురవేశారు. నా కదలికలు తెలుసుకునేందుకు డ్రోన్‌ వాడారు. ములాఖత్‌లో నన్ను కలిశాక వారి చిత్రాల కోసం డ్రోన్‌ ఎగురవేశారు. నాతోపాటు నా కుటుంబసభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉంది. జైలుపై డ్రోన్ ఎగురవేసింది వైకాపా వారేనని అనుమానం. ఈ విషయంపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. డ్రోన్‌ ఘటన ప్రధాన సూత్రధారి ఎవరో గుర్తించలేదు. ఇది జైలు అధికారుల నిస్సహాయతకు నిదర్శనం. కొందరు గంజాయి ప్యాకెట్లు జైల్లోకి విసిరారు. గార్డెనింగ్‌ విధుల్లోని ఖైదీలు వాటిని పట్టుకున్నారు. రాజమహేంద్రవరం జైల్లో మొత్తం 2,200 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 750 మంది డ్రగ్స్‌ కేసు నిందితులు. కొంతమంది ఖైదీల వల్ల నా భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. జడ్‌ ప్లస్‌ కేటగిరీ రక్షణలో ఉన్న నా భద్రతకు ఇది తీవ్రమైన ముప్పు.’’ అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని