Bhatti vikramarka: భారాస పాలనలో పౌరసరఫరాల శాఖ నిర్వీర్యం: భట్టి

పదేళ్ల భారాస పాలనలో పౌర సరఫరాల శాఖను నిర్వీర్యం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు.

Published : 20 Jan 2024 19:39 IST

దిల్లీ: పదేళ్ల భారాస పాలనలో పౌర సరఫరాల శాఖను నిర్వీర్యం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మండిపడ్డారు. అప్పులు, వడ్డీలతో ప్రజలపై భారం మోపారని ఆక్షేపించారు. వార్షిక బడ్జెట్‌ కసరత్తులో భాగంగా పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనేలా పౌరసరఫరాల శాఖకు నిధులు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజాభిప్రాయాలకు అణుగుణంగానే అభివృద్ధి సాగుతుందని స్పష్టం చేశారు.

కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించాలన్న ప్రతిపాదనలేవీ తాము చేయలేదని మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్‌తో అంటకాగి, కృష్ణా జలాల్లో వాటాను వదులుకున్న చరిత్ర కేసీఆర్‌దేనని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ఖజానాను భారాస లూటీ చేసిందని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని భారాస చేతిలో పెడితే అప్పులపాలు చేశారని, అందుకే ప్రజలు ఆ పార్టీకి వీఆర్‌ఎస్‌ ఇచ్చారన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు. గతంలో ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌, జగన్‌ మాట్లాడుకున్న విషయాలు ప్రజలకు ఎందుకు చెప్పలేదని ఉత్తమ్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని