Kishan reddy: హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదు: కిషన్‌రెడ్డి

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 18 May 2024 15:05 IST

భువనగిరి: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. భువనగిరిలో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి తరఫున నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కాషాయ పార్టీకే అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. దేశంలో మేధావులు, విద్యావంతులు కమలదళానికి అండగా ఉన్నారని తెలిపారు. 

కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకత వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని వివరించారు. ఇకపై తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఫలితాలు ఉంటాయని జోస్యం చెప్పారు. భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఇమడలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, భారాసలకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదుగుతోందని తెలిపారు. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ప్రజలను మళ్లీ ఏ విధంగా ఓట్లడుగుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే దాకా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని