CM Revanth: నేనంటే అల్లాటప్పా అనుకోవద్దు.. కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్లలో నిర్వహించిన ‘జనజాతర’ సభలో ఆయన మాట్లాడారు.

Updated : 27 Feb 2024 20:47 IST

చేవెళ్ల: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్లలో నిర్వహించిన ‘జనజాతర’ సభలో ఆయన మాట్లాడారు. ‘‘రేవంత్‌ పేరు చెబితే.. 3 సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్‌ చెప్పారు. ఆయనకు చేవెళ్ల సభ నుంచి సవాల్‌ విసురుతున్నా. దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు ఒక్క సీటయినా గెలిపించి చూపించాలి. రేవంత్‌రెడ్డి అంటే అల్లాటప్పా అనుకోవద్దు. తండ్రి పేరు చెప్పి పదవిలో కూర్చున్న వ్యక్తిని కాదు. కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగాను. చంచల్‌గూడ జైలులో పెట్టినా.. లొంగిపోకుండా పోరాడాను. నల్లమల అడవుల నుంచి దుర్మార్గులు, అవినీతిపరులను తొక్కుకుంటూ వచ్చాను. కార్యకర్తల అండ ఉన్నంతకాలం నా కుర్చీని ఎవరూ తాకలేరు’’ అని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ కమిటీలను పునరుద్ధరిస్తాం

గత ప్రభుత్వంలో అణచివేతకు గురికాని వర్గమంటూ లేదని రేవంత్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటులో కార్యకర్తల శ్రమ, రక్తం ఉందని.. వాళ్ల రుణం తీర్చుకుంటామని తెలిపారు. ఎంపీలను గెలిపించడంతోనే తమ బాధ్యత తీరిపోదని, పార్టీ జెండా మోసిన వారికి న్యాయం చేస్తామని వెల్లడించారు. ‘‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? కేడీ.. మోదీ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. ఇద్దరూ కలిసి కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు నాటకాలు ఆడుతున్నారు. త్వరలో మెగా డీఎస్సీ వేసి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మళ్లీ ఇందిరమ్మ కమిటీలను పునరుద్ధరిస్తాం. కాంగ్రెస్‌ అభయహస్తం హామీలను ఇంటింటికీ కార్యకర్తలు తీసుకెళ్లాలి’’ అని దిశానిర్దేశం చేశారు. 

తెలంగాణను కేసీఆర్‌ అప్పుల ఊబిలోకి నెట్టారు: భట్టి

‘‘మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్‌ అప్పుల ఊబిలోకి నెట్టారు. రాష్ట్ర ప్రజలపై కేసీఆర్‌ ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల అప్పుల భారం మోపింది. గత ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి ఈ ప్రాంతానికి నీరు రాకుండా చేసింది. తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును నిపుణులు, ఇంజినీర్లు వద్దంటున్నా.. మేడిగడ్డ వద్ద కట్టారు. రూ.లక్ష కోట్ల నిధులు గోదావరిలో పోసి వృథా చేశారు’’ - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని