CPI-CPM: మిత్ర ధర్మం పాటించరా? కేసీఆర్‌ సమాధానం చెప్పాలి: సీపీఐ, సీపీఎం

భారాసతో పొత్తు చెడిపోతే వ్యక్తిగతంగా దూషించబోమని, విధాన పరంగా వ్యతిరేకిస్తామని సీపీఐ, సీపీఎం నేతలు ప్రకటించారు. హైదరాబాద్ మగ్దూం భవన్‌లో సీపీఐ, సీపీఎం నేతలు సమావేశమయ్యారు.

Updated : 22 Aug 2023 17:29 IST

హైదరాబాద్‌: భారాసతో పొత్తు చెడిపోతే వ్యక్తిగతంగా దూషించబోమని, విధాన పరంగా వ్యతిరేకిస్తామని సీపీఐ, సీపీఎం నేతలు ప్రకటించారు. హైదరాబాద్ మగ్దూం భవన్‌లో సీపీఐ, సీపీఎం నేతలు సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణ, ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై ఇరు పార్టీలకు చెందిన నేతలు చర్చించారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, జాన్ వెస్లీ, చెరుపల్లి సీతారాములు, సుదర్శన్, సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, తక్కలపల్లి శ్రీనివాస్‌రావు, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.

సమావేశం ముగిసిన తరువాత కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.‘‘ సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో మాకేం నష్టం లేదు. నష్టపోయేది కేసీఆరే. భాజపాతో భారాసకు సఖ్యత ఏర్పడింది. భాజపా ప్రమాదం కాదా? ఇప్పుడు చెప్పాలి. మిత్ర ధర్మం పాటించరా? కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. రాజకీయం అంటేనే మోసం అనే నిర్వచనం ఇస్తున్నారు. వామపక్షాలు లేకపోతే మునుగోడులో భారాస ఏమయ్యేది. మునుగోడు ఎన్నికల్లో కేసీఆరే మా అండ కోరారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కూడా వామపక్షాలు మిత్రపక్షాలని కేసీఆర్‌ చెప్పారు. కేసీఆర్‌ ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌ నిర్ణయం మేం ఊహించని పరిణామం. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తాం’’ అని ఇరు పార్టీల నేతలు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని