CPI Ramakrishna: ఏపీ సీఎం అంటే కేంద్రానికి లెక్కే లేదు: రామకృష్ణ

ఏపీ వ్యాప్తంగా కరవు పరిస్థితి అధికంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 20 Nov 2023 13:36 IST

విజయవాడ: ఏపీ వ్యాప్తంగా కరవు పరిస్థితి అధికంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. కరవు, కృష్ణా జలాల పునఃపంపిణీ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో నేతలు 30 గంటల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు.

‘‘కరవుపై సీఎం జగన్‌ అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్రంలో కరవు మండలాలు 400 ఉంటే ఆ తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి చెబుతోంది. అందుకే ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. రాష్ట్రంలో చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. రైతులు, కూలీలు, చేతివృత్తుల వారు వలసలు పోతున్నారు. జీవనం దుర్భరంగా మారడంతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఇంత జరుగుతున్నా సీఎం జగన్‌లో చలనం లేదు. రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టలేదు.

కరవుపై సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ మాట్లాడటం లేదు. కనీసం కేబినెట్‌లో అయినా దీనిపై చర్చించని దుర్మార్గ ప్రభుత్వం ఇది. బటన్‌ నొక్కే మంత్రిగా సీఎం మారారు. ఆ నిధులు కూడా లబ్ధిదారుల ఖాతాల్లో పూర్తిస్థాయిలో పడటం లేదు. జగన్‌ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. రైతుల గోడు పట్టించుకోని వ్యక్తి సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యం. ఆయన సాయం చేయకపోగా కేంద్రానికి నివేదిక కూడా పంపడం లేదు. ఏపీ సీఎం అంటే కేంద్రానికి లేక్కే లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులను ఆదుకోవాలి’’ అని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని