Eatala Rajender: ‘మేడిగడ్డ’.. కట్టినప్పటి నుంచే లీక్‌ అవుతోంది: ఈటల

Updated : 23 Oct 2023 14:25 IST

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అతి కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వంతెన కుంగిపోవడం ఆందోళనకరమని భాజపా ఎమ్మెల్యే, ఆ పార్టీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్ అన్నారు. పేరు తమకే రావాలనే సంకుచిత లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు.

‘‘ఆదివారం మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించి వచ్చాం. గతంలో విశ్వేశ్వరరెడ్డి పలుమార్లు సందేహాలు లేవనెత్తారు. కాళేశ్వరంపై కేసీఆర్ మాట్లాడిన సమయంలో దాని నిర్మాణ తీరుపై నిపుణులు హెచ్చరించారు. అలొకేషన్‌ పద్ధతిలో కావాలనే ప్రాజెక్టులు కొందరికి అప్పజెప్పారు. ఎలాంటి సాంకేతికత వాడకపోయినా ఇప్పటికీ నాగార్జునసాగర్‌ డ్యామ్‌ చెక్కు చెదరకుండా ఉంది. కాళేశ్వరంలోని మూడు ప్రాజెక్టులను అతి తక్కువ కాలంలో కట్టి జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు సైట్ ఎంపికలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మేడిగడ్డ బ్యారేజీ కట్టినప్పటి నుంచే లీక్ అవుతోంది. ఇసుకమీదే ప్రాజెక్టు కట్టారు. కన్నెపల్లి పంప్‌హౌస్ మొత్తం కూలిపోయింది. అప్పుడు నిపుణులను పంప్‌హౌస్‌ పరిసరాల్లోకి రాకుండా 144 సెక్షన్ విధించారు. నిజాలను దాచే ప్రయత్నం చేశారు.

ప్రభుత్వ తప్పిదం వల్ల రూ.వేలకోట్ల నష్టం జరుగుతోంది. ఇవాళ ప్రాజెక్టు పరిస్థితి నిర్మాణ లోపాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రాజెక్టులు కేవలం టూరిస్ట్ స్పాట్లగా మిగులుతున్నాయి. ప్రజల డబ్బుతో కట్టిన ప్రాజెక్టుల విషయంలో వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వైఫల్యానికి సీఎం కేసీఆరే కారణం. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం తన పదవికి రాజీనామా చేయాలి. ఈ ఘటనపై నిపుణుల కమిటీ వేసి ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని ఈటల డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని