నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు

నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections) నోటిఫికేషన్‌ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Updated : 18 Apr 2024 09:35 IST

దిల్లీ: నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections) నోటిఫికేషన్‌ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నాలుగో విడతలో లోక్‌సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బిహార్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, జమ్మూకశ్మీర్‌ ఉన్నాయి. వీటిలో మొత్తం 96 లోక్‌సభ స్థానాల్లో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి.

నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి ఏపీ, తెలంగాణ సహా ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించనున్నారు. ఈనెల 25 వరకు స్వీకరణ చేపట్టి.. 26న నామినేషన్లను పరిశీలించనున్నారు. 29 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మే 13న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్‌ పత్రాలు సమర్పించాలి. లోక్‌సభ అభ్యర్థి రూ.25 వేలు, శాసనసభ అభ్యర్థి రూ.10 వేలు ధరావతు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50% చెల్లిస్తే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని