MLC elections: ఎట్టకేలకు రామగోపాల్‌రెడ్డికి డిక్లరేషన్‌ అందజేత

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి అధికారులు ఎట్టకేలకు డిక్లరేషన్‌ ఫారం అందజేశారు.

Updated : 19 Mar 2023 13:26 IST

అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ఎట్టకేలకు డిక్లరేషన్‌ ఫారం అందుకున్నారు. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆయనకు డిక్లరేషన్‌ ఫారం అందజేశారు. ఆయన వెంట కాలవ శ్రీనివాసులు, పార్థసారథి, తెదేపా నేతలు, తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీగా రామగోపాల్‌రెడ్డి గెలిచినట్టు అధికారులు శనివారం రాత్రే ప్రకటించినా ఆయనకు ధ్రువీకరణ పత్రం అందించలేదు. దీనిపై తెదేపా నేతలు, కార్యకర్తలు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు.

రామగోపాల్‌రెడ్డికి ధ్రువీకరణపత్రం అందించకపోవడంపై ఆగ్రహించిన తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, శ్రీసత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరాం, కళ్యాణదుర్గం నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు తదితరులు జేఎన్‌టీయూ గేటు ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. సంయుక్త కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ కారును అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పోలీసులు రంగప్రవేశం చేసి తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, శ్రీసత్యసాయి జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌, కళ్యాణదుర్గం నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు తదితరులను అరెస్టు చేసి, మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ పోలీసులే ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతుంటే కాపాడేవారెవరని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలను అధికారులు ఉల్లఘించారని, దీనిపై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. స్టేషన్‌ వద్ద కూడా నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 1.30 వరకూ నేతలను పోలీసు స్టేషన్‌లోనే ఉంచారు. ఈ పరిణామాల అనంతరం రామగోపాల్‌రెడ్డి కలెక్టర్‌ చేతుల మీదుగా ఎట్టకేలకు డిక్లరేషన్‌ ఫారం అందుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని