Congress: చేతులేనా.. చేతల్లోనూనా!: గహ్లోత్‌, పైలట్‌ మధ్య సయోధ్యపై సందేహాలు

ఉత్తరాదిలో కీలకమైన రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ మధ్య నెలకొన్న స్పర్థలను తొలగించి జోడు గుర్రాలతో శాసనసభ ఎన్నికలకు వెళ్లాలన్న అధిష్ఠానం ప్రయత్నాలు ఫలించేనా అనే సందేహాలు అప్పుడే మొదలయ్యాయి.

Updated : 31 May 2023 09:22 IST

అధిష్ఠానం మంత్రం ఎంతవరకు ఫలిస్తుందో!

దిల్లీ: ఉత్తరాదిలో కీలకమైన రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ మధ్య నెలకొన్న స్పర్థలను తొలగించి జోడు గుర్రాలతో శాసనసభ ఎన్నికలకు వెళ్లాలన్న అధిష్ఠానం ప్రయత్నాలు ఫలించేనా అనే సందేహాలు అప్పుడే మొదలయ్యాయి. అధిష్ఠానం ఈ ఇద్దరు నేతల్ని సోమవారం దిల్లీకి పిలిపించి మాట్లాడి, చేతులు కలిపేందుకు వారు సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను లోతుగా చూసినవారు మాత్రం అవి పైపై మాటలే తప్పిస్తే గుండెలోతుల్లోంచి వచ్చినవి కావని భావిస్తున్నారు. అన్ని అంశాలనూ హైకమాండ్‌కే వదిలేశారని పార్టీ నాయకత్వం ప్రకటించగా.. గహ్లోత్‌తో విభేదించడానికి ఉన్న కీలక అంశాలు అపరిష్కృతంగానే మిగిలి ఉన్నాయని పైలట్‌ సన్నిహితులు చెబుతున్నారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తొలుత గహ్లోత్‌తో రెండుగంటలు భేటీ అయ్యారు. తర్వాత పైలట్‌తో విడిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత అందరూ బయటకు వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చారు. పేరుకు ఒకేఇంట్లో జరిగిన సమావేశమే అయినా ఇద్దరితో అధిష్ఠానం దాదాపు విడివిడిగానే మాట్లాడిందని చెప్పాలి. విలేకరులు ప్రశ్నించినప్పుడు వారిద్దరూ కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ మాట్లాడారు. సామరస్యత కుదిరందన్న సంకేతాలు ఇద్దరు కీలక నేతల హావభావాల్లో ఏమాత్రం కనిపించలేదు.

మూడు డిమాండ్లపై పైలట్‌ పట్టు

వసుంధర రాజె ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతిపై చర్యలు, రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పునర్వ్యవస్థీకరణ, పేపర్‌లీక్‌ల వల్ల పరీక్షలు రద్దయి ఇబ్బందులు పడినవారికి పరిహారం చెల్లించడం.. ఈ మూడు డిమాండ్లపై ఏమాత్రం వెనక్కి తగ్గరాదని పైలట్‌ కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాను వాటిపై గళమెత్తుతూనే ఉంటానని ఆయన తెగేసి చెబుతున్నారు. అటు గహ్లోత్‌ చూస్తే.. ఎవరి డిమాండ్లకూ పార్టీ తలొగ్గబోదనీ, అలాంటి పరిస్థితే కాంగ్రెస్‌లో రాదని కరాఖండీగా ప్రకటిస్తున్నారు. 2018లో రాజస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఆ తిరుగుబాటు చర్యలతోనే పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. నాయకత్వాన్ని మార్చాలని గత ఏడాది కూడా అధిష్ఠానం ప్రయత్నించింది. శాసనసభాపక్ష సమావేశ నిర్వహణకే గహ్లోత్‌ విధేయులు అనుమతించకపోవడంతో అది వీలుపడలేదు.


సహనంతో ఉండాలి

గహ్లోత్‌

తాను, సచిన్‌ కలిసి పనిచేయడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరానికి చేరుస్తామని గహ్లోత్‌ ప్రకటించారు. ఒక హోదాలో సేవలందించడానికి సహనంతో వేచి ఉండాలని పార్టీ కార్యకర్తలు, నాయకులకు నర్మగర్భంగా సూచించారు. ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది అధిష్ఠానం చూసుకుంటుందని, మూడుసార్లు సీఎంగా, మరో మూడుసార్లు కేంద్ర మంత్రిగా చేసినందువల్ల తనకు పదవులు ముఖ్యం కాదని మంగళవారం దిల్లీలో స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని