జగన్‌ నిర్లక్ష్య వైఖరితో రైతులకు నష్టం

ప్రస్తుత తుపాను కారణంగా రైతులు, ప్రజలు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 06 Dec 2023 05:24 IST

జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: ప్రస్తుత తుపాను కారణంగా రైతులు, ప్రజలు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనం వల్ల నష్టం అధికంగా ఉందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రైతులు అష్టకష్టాలు పడి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో ఇలా నష్టపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకానికి రాష్ట్ర వాటా చెల్లించలేదని, తామే కడతామని చెప్పి మరీ కట్టకుండా అన్నదాతలకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని చేతకాని పాలన అనకుండా ఏమనాలని ప్రశ్నించారు. ఇందుకు ముఖ్యమంత్రి జగన్‌ బాధ్యత వహించాలని, పంటలు నష్టపోయిన సాగుదారులకు తక్షణ సాయంగా ఎకరానికి రూ.20 వేల చొప్పున అందించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాకు రూ.2 కోట్ల వంతున ప్రభుత్వం ప్రకటించిన సాయం ఏమూలకూ చాలదన్నారు. రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. తుపాను నష్టాలపై వివిధ జిల్లాల నాయకులతో మాట్లాడి కర్షకులకు అండగా ఉండాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని