న్యాయస్థానాలు, హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలంటే లెక్కలేదా?

రాష్ట్రంలో ఇసుక, మట్టి, కొండలు, గుట్టలను సీఎం జగన్‌, వైకాపా నేతలు కొల్లగొడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు.

Updated : 08 Dec 2023 06:31 IST

జగన్‌పై తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో ఇసుక, మట్టి, కొండలు, గుట్టలను సీఎం జగన్‌, వైకాపా నేతలు కొల్లగొడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. న్యాయస్థానాలు, హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాల్ని ధిక్కరిస్తూ.. యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌ లారీలు కొని, అమరావతి పరిధిలో ఉన్న రీచ్‌లలో పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు సాగిస్తూ.. పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక తవ్వకాల్లో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతుంటే అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ అబద్ధాలు చెబుతూ, న్యాయస్థానాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘నాలుగున్నరేళ్లలో ఇసుక తవ్వకాల ద్వారా జగన్‌ రూ.40 వేల కోట్లు దోచుకున్నారు. జేపీ వెంచర్స్‌ కాలపరిమితి ముగిసినా, ఆ సంస్థ ముసుగులో వైకాపా నేతలు యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. అసలు జేపీ వెంచర్స్‌ ఎంత తవ్వింది? ప్రభుత్వానికి ఎంత చెల్లించిందో తెలియదు. పైగా జగనన్న కాలనీలకు మెరక పోసినందుకు తమకే ప్రభుత్వం బకాయి పడిందని ఆ సంస్థ చెబుతోంది. మెరక తోలితే చిన్నపాటి వర్షానికే జగనన్న కాలనీలు ఎందుకు చెరువుల్ని తలపిస్తున్నాయి’’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని