ఎన్నికల్లో పొత్తులు ఉండవు!

పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపా పొత్తులు లేకుండా పోటీ చేస్తుందని రాజ్యసభ సభ్యుడు  కె.లక్ష్మణ్‌ అన్నారు. విజయ సంకల్పయాత్ర బుధవారం వికారాబాద్‌ జిల్లా పరిగికి చేరుకుంది.

Published : 22 Feb 2024 04:17 IST

ప్రాంతీయ పార్టీలతో దేశానికి నష్టం
ఎంపీ లక్ష్మణ్‌

పరిగి, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపా పొత్తులు లేకుండా పోటీ చేస్తుందని రాజ్యసభ సభ్యుడు  కె.లక్ష్మణ్‌ అన్నారు. విజయ సంకల్పయాత్ర బుధవారం వికారాబాద్‌ జిల్లా పరిగికి చేరుకుంది. స్థానిక అంబేడ్కర్‌ కూడలి వద ఆధ్యాత్మికవేత్త డాక్టర్‌ భాస్కరయోగి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలతో దేశానికి నష్టం కలుగుతుందన్నారు. భారాస, కాంగ్రెస్‌ తోడుదొంగలని.. ఒకేగూటి పక్షులని పేర్కొన్నారు. ఒవైసీని చంకనబెట్టుకుని మతరాజకీయాలు చేసే ఆ పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు. మతోన్మాద పార్టీ మజ్లిస్‌ను ఎదుర్కొనే ధైర్యం భాజపాకే ఉందన్నారు. కాంగ్రెస్‌ కాలగర్భంలో కలిసిపోతోందని... ఎన్నికలు ముగిసిన అనంతరం రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని జోస్యం చెప్పారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎక్కువకాలం మనుగడ సాగించలేదని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి గెలిచిన నలుగురు ఎంపీలు రాష్ట్రానికి రూ.10లక్షల కోట్లు తెచ్చారన్నారు. ఒక్క రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం రూ.4,400 కోట్లు కేటాయించిందని.. ఇక అన్ని సీట్లలో గెలిపిస్తే అన్ని విధాలుగా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని