వైకాపాకు ఎంపీల ఝలక్‌!

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని వైకాపా అధిష్ఠానం ప్రకటించినా ఆయన పోటీకి నిరాకరించి పార్టీకి ఝలక్‌ ఇచ్చారు.

Published : 22 Feb 2024 04:25 IST

తాజాగా వేమిరెడ్డి..
ఇప్పటికే పార్టీని వీడిన ముగ్గురు ఎంపీలు

ఈనాడు, అమరావతి: వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని వైకాపా అధిష్ఠానం ప్రకటించినా ఆయన పోటీకి నిరాకరించి పార్టీకి ఝలక్‌ ఇచ్చారు. ఇప్పటికే లోక్‌సభ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు(నరసరావుపేట), వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం), డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌(కర్నూలు) వైకాపాకు గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. బాలశౌరి అధికారికంగా జనసేనలో చేరారు. ఎంపీలకు కనీస గుర్తింపును ఇవ్వకపోవడం..పార్లమెంటులోనూ వారు స్వతంత్రంగా మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో వారు పార్టీకి దండం పెట్టి బయటకు వెళ్లిపోయారు. వైకాపాకు ఆర్థికంగా మద్దతుగా నిలిచే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని 2018లో రాజ్యసభకు పంపారు. ఇప్పుడు ఆయన పదవీకాలం ముగియనుంది. ఆయన మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకే మొగ్గుచూపినా..వైకాపా అధిష్ఠానం మాత్రం ఆయనను నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించింది. పార్టీ కోసం ఆయన పోటీకి సిద్ధపడినప్పటికీ..పార్టీ పెద్దల నుంచి కనీస మద్దతు లభించలేదు. తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులపై జనంలో బాగా వ్యతిరేకత ఉందని, వారిని మార్చాలని ఆయన ముఖ్యమంత్రి జగన్‌ను వ్యక్తిగతంగా కలిసి కోరినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన మనస్తాపానికి గురై పార్టీని వీడారు.

  • అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి మార్చారు. తర్వాత ఆమెను అక్కడ నుంచి కూడా తప్పించేశారు. ఇప్పటివరకూ మరెక్కడా ఆమెకు పోటీకి అవకాశం కల్పించలేదు.
  • హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పూర్తిగా పన్కనపెట్టేశారు. ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలపకపోయినా.. ఎక్కడో ఒక చోట అసెంబ్లీ నియోజవర్గంలోనైనా అవకాశం కల్పించండని మాధవ్‌ అనేకసార్లు ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరిగారు. అయినా ఆయనకు ముఖ్యమంత్రి జగన్‌ నుంచి ఎలాంటి హామీ లభించలేదు. పోలీసు అధికారిగా పనిచేసిన మాధవ్‌.. 2019 ఎన్నికల సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసి వైకాపాలో చేరి హిందూపురం నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
  • తిరుపతి ఎంపీని సత్యవేడు, చిత్తూరు ఎంపీని గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మార్చారు. కానీ, పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో వారిద్దరినీ మళ్లీ వారి పాత స్థానాల్లోనే పోటీకి నిలుపుతున్నారు.
  • ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ ఈసారి అసలు పోటీ చేయనని తేల్చేయడంతో..ఆయన స్థానంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ కుమార్‌ను సమన్వయకర్తగా నియమించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని