పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తులో వాలంటీర్ల ప్రమేయం లేకుండా చూడాలి

వృద్ధులు, దివ్యాంగుల పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తులో వాలంటీర్ల ప్రమేయం లేకుండా సీఈవో, డీఈవో, ఆర్వోలకు ఆదేశాలివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు.

Published : 23 Feb 2024 04:43 IST

ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి : వృద్ధులు, దివ్యాంగుల పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తులో వాలంటీర్ల ప్రమేయం లేకుండా సీఈవో, డీఈవో, ఆర్వోలకు ఆదేశాలివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలనే నిబంధనను అధికార పార్టీ నాయకులు యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం ఆయన లేఖ రాశారు. ‘ఎన్నికల్లో వాలంటీర్ల ద్వారా పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడాలని అధికార పార్టీ చూస్తోంది. అందులో భాగంగానే వారిని సత్కరించడానికి జగన్‌ ప్రభుత్వం రూ.392 కోట్లు వెచ్చిస్తోంది. వాలంటీర్లకు వందనం పేరుతో వారం రోజులపాటు నియోజకవర్గ స్థాయిలో వైకాపా ఎమ్మెల్యేలు నగదు బహుమతులు అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 15న సీఎం జగన్‌ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు బూత్‌ ఏజెంట్లుగా కూర్చొవాల్సి వస్తుందని, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలని, వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తు చేసేందుకు సహకరించాలని సూచించారు. ఇలాంటి చర్యలు ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించడమే. ఈ అంశాలపై దృష్టి పెట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని లేఖలో కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు