వచ్చీరాగానే జోలె పట్టిన నేత

రాజధాని ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి టికెట్ల సర్దుబాటులో భాగంగా అధికార పార్టీ అధిష్ఠానం ఇటీవల నియోజకవర్గాన్ని మార్చింది. దూకుడు, దుందుడుకు స్వభాగం గల ఆ నేత కొత్త ప్రదేశానికి వచ్చీ రాగానే దుకాణం తెరిచారు.

Updated : 23 Feb 2024 12:56 IST

నియోజకవర్గం మారిన ఓ నేత వసూళ్ల పర్వం
విద్యాసంస్థలు, రియల్టర్లకు బెదిరింపులు
రేయింబవళ్లూ ఇసుక తవ్వకాలు
రాష్ట్ర నడిబొడ్డున ఓ నాయకుడి నిర్వాకాలు

ఈనాడు, అమరావతి: రాజధాని ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి టికెట్ల సర్దుబాటులో భాగంగా అధికార పార్టీ అధిష్ఠానం ఇటీవల నియోజకవర్గాన్ని మార్చింది. దూకుడు, దుందుడుకు స్వభాగం గల ఆ నేత కొత్త ప్రదేశానికి వచ్చీ రాగానే దుకాణం తెరిచారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆ ప్రాంతం..  రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు నెలవు. ప్రముఖ విద్యాసంస్థలకు నిలయం. నది వెంబడి ఇసుక రేవులూ ఎక్కువే. వీటన్నింటినీ ఆదాయ వనరులుగా మార్చుకున్న ఆ నేత.. అనుచరులతో కోట్లలో వసూలు చేయిస్తున్నారు. ‘ఎలక్షన్‌ ఫండ్‌’ పేరుతో జోలె పట్టి అక్రమార్జనలో మునిగితేలుతున్నారు. తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, జలవనరుల శాఖ ఇంజినీర్లకు లక్ష్యాలు విధిస్తూ వారి ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు. ‘ఇక్కడికి వచ్చి నెల రోజులైనా కాలేదు. ఇప్పుడే ఇలా చేస్తుంటే రేపటి ఎన్నికల్లో గెలిస్తే తమ పరిస్థితేంటి?’ అని వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు.

జనానికి సున్నం.. అధినేత ప్రసన్నం

ఈ నాయకుడు అంతకుముందు స్వస్థలంలో ఓడిపోతే.. గత ఎన్నికల్లో మరో నియోజకవర్గానికి పంపించారు. అక్కడ గెలిచినప్పటికీ అక్రమార్జనకు పెద్దగా అవకాశాల్లేకుండా పోయాయి. దీంతో పాత నియోజకవర్గంలోని వనరులపై కన్నేశారు. ఇసుక, బూడిద రవాణాకు సొంత ముఠాను ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యేతో విభేదాలు రావడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఉచితంగా దొరికే బూడిదను ఎత్తి రూ.కోట్లు కొల్లగొడుతున్న వైనంపై అధినేతకు ఫిర్యాదులు వెళ్లాయి. కానీ ఆ దూకుడు నేతను ఏమీ అనకపోవడంతో అతని దందాకు లైసెన్స్‌ ఇచ్చినట్లైంది. అదే క్రమంలో అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యర్థి పార్టీపైకి కర్రలు చేతబూని మరీ దాడికి వెళ్లారు. ఈ ఘటన తర్వాత అధినేత మరింత పెద్ద పదవితో వీరతిలకం దిద్దారు. ఇక అంతే, అతని ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.


అక్రమాల చిట్టాలో మచ్చుకు కొన్ని..

ఈ నేత కొత్త నియోజకవర్గంలో కార్యకలాపాలు ప్రారంభించిన వెంటనే అతనిలోని అసలు అక్రమార్జనుడు నిద్ర లేచాడు. అంతకుముందు అక్కడి ప్రజాప్రతినిధి దగ్గర ఉన్న ‘రాంబంటు’.. అతన్ని వదిలి ఈ నేత పంచన చేరారు. ఈ వ్యక్తి గతంలో రాముని పేరు చెప్పి రూ.కోట్లు కొల్లగొట్టడంతో ఆ నేత పక్కన పెట్టారు. ఇప్పుడీ కొత్త నాయకుడి వద్ద విధేయుడిగా చేరిన రాంబంటు స్థిరాస్తి వ్యాపారుల వద్ద ఎన్నికల ఖర్చు పేరుతో జోలె పట్టారు. ఓ ప్రముఖ సంస్థ పంచాయతీ అనుమతులు లేకుండానే 40 ఎకరాల్లో భారీ వెంచర్‌ వేసింది. పక్కనున్న రోడ్డుకు మరమ్మతులు చేయించేందుకు ఓ సంస్థకు రూ.10 లక్షల చెక్‌ అందించింది. ఇది తెలిసిన గ్రామస్థులు.. రోడ్డు ధ్వంసమైందని, రూ.కోటి ఇవ్వాల్సిందేనని భీష్మించారు. వెంచర్‌లో పనులను అడ్డుకొని వాహనాలు రాకుండా రోడ్డును తవ్వేశారు. కొత్త ప్రజాప్రతినిధి రంగంలో దిగి, వ్యవహారం చక్కబెట్టారు. రియల్టర్ల నుంచి ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ.40 లక్షల గుడ్‌విల్‌ అందుకున్నారు. గ్రామస్థుల నోటికి తాళం వేయించారు.

  • ఈ నియోజకవర్గంలో విద్యా సంస్థలు ఎక్కువ. రెండు ప్రముఖ సంస్థల బ్రాంచీలు అనేకం ఉన్నాయి. ఈ నాయకుడికి ఎన్నికల విరాళం ఇవ్వాలంటూ అనుచరుడు రాంబంటు ద్వారా ఆ కాలేజీలకు సందేశం పంపించారు.
  •  మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమాంతం పడిపోయిన స్థిరాస్తి వ్యాపారం.. తెదేపా- జనసేన పొత్తు ప్రభావంతో ఇటీవల పుంజుకుంటోంది. కొత్తగా వెంచర్లు వేస్తున్న వారిపై కన్నేసిన వసూలురాజా అనధికార లేఔట్లు, నిర్మాణాలను టార్గెట్‌గా చేసుకొన్నారు. ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. రాంబంటుకు గతంలో ఉన్న అనుభవంతో వెంచర్ల యజమానులకు హెచ్చరికలు పంపుతున్నారు. మూణ్నాలుగు వారాలుగా ఈ ప్రాంతంలో రియల్టర్లు హడలిపోతున్నారు. వసూలురాజా నివాసం సమీపంలోనే ఉన్నా ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని అడ్డాగా మార్చుకున్నారు.
  • తన నియోజకవర్గం కాకపోయినా జగనన్న కాలనీల పేరుతో కలెక్టర్ల నుంచి గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతి తీసుకున్నారు. అనుచరులతోమట్టి తవ్విస్తున్నారు. నగరానికి సమీపంలో కొండలను కరిగించేస్తున్నారు.
  •  ఈ నియోజకవర్గం పరిధిలో నాలుగైదు ఇసుక రేవులు ఉన్నాయి. కొత్తగా టెండర్‌ దక్కించుకున్న సంస్థను కాదని, ఇసుక తవ్వకాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఈ రీచ్‌ల నుంచి హైదరాబాద్‌కు ఇసుక తరలిస్తున్నారు. రోజుకు రూ.50 లక్షల చొప్పున 20 రోజులుగా రూ.10 కోట్ల వరకు కొల్లగొట్టారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
  • ఈ నాయకుడి అనుచరులు నియోజకవర్గంలోని ఓ మున్సిపల్‌ కమిషనర్‌ను ‘సార్‌ పర్యటనలకు ఖర్చులు భరించాలి. మీ వాటా రూ.లక్ష!’ అంటూ రేట్‌ ఫిక్స్‌ చేశారు. ఆ అధికారి కిమ్మనకుండా సమర్పించుకున్నారు. తహసీల్దారు, ఎంపీడీవోలు, ఇంజినీర్లకు కూడా టార్గెట్లు పెడుతున్నారు. మహిళలతో సమావేశాలు నిర్వహిస్తూ చికెన్‌తో భోజనాలు పెట్టిస్తూ, బిల్లులు మాత్రం డ్వాక్రా గ్రూపులకు పంపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని