వైకాపా ప్రభుత్వంలో అగ్రవర్ణాలకో న్యాయం.. దళితులకో న్యాయమా?

‘వైకాపా ప్రభుత్వంలో అగ్రవర్ణాలకో న్యాయం.. దళితులకో న్యాయమా? మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్‌ సుధాకర్‌ను నడిరోడ్డుపై అర్ధనగ్నంగా కూర్చోబెట్టి పిచ్చోణ్ని చేశారు.

Published : 23 Feb 2024 04:57 IST

బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ ధ్వజం
బీఎస్పీలో చేరిన విశ్రాంత ఐపీఎస్‌ అధికారి పూర్ణచంద్రరావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘వైకాపా ప్రభుత్వంలో అగ్రవర్ణాలకో న్యాయం.. దళితులకో న్యాయమా? మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్‌ సుధాకర్‌ను నడిరోడ్డుపై అర్ధనగ్నంగా కూర్చోబెట్టి పిచ్చోణ్ని చేశారు. హత్యకేసులో నిందితుడిగా అభియోగం ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డి మాత్రం ఇప్పటి వరకూ ఎందుకు అరెస్టు కాలేదు? సీబీఐ కూడా ఆయన్ను  అదుపులోకి తీసుకోలేకపోయింది. వారు హత్యలు చేసినా సులువుగా బెయిలు తెచ్చుకుంటారు. సమాజంలో దర్జాగా తిరుగుతారు’ అని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. విజయవాడలో గురువారం విశ్రాంత ఐపీఎస్‌ అధికారి పూర్ణచంద్రరావు బీఎస్పీలో చేరిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను ఏపీకి వచ్చే దారుల్లో ఎక్కడ చూసినా ‘సిద్ధం’ అనే పోస్టర్లు కనిపించాయని.. మిమ్మల్ని గద్దె దింపడానికి బీఎస్పీ కూడా ‘సిద్ధం’గా ఉందని వ్యాఖ్యానించారు. తొలుత బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్‌.. పూర్ణచంద్రరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించారు. రాంజీ గౌతమ్‌ మాట్లాడుతూ.. దేశంలో బడుగు బలహీనుల కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఎస్పీయే అన్నారు. అన్ని పార్టీలూ బడా వ్యాపారుల నుంచి ఎన్నికల బాండ్ల ద్వారా రూ.వేల కోట్లు తీసుకున్నాయని, కానీ బీఎస్పీ కార్యకర్తల చెమటోడ్చిన డబ్బుతోనే పనిచేస్తుందని చెప్పారు.  ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న పార్టీల నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పూర్ణచంద్రరావు అన్నారు. జర్నలిస్టులు, మీడియా సంస్థలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి, పార్టీ జాతీయ సమన్వయకర్త బాలయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని