‘సామాజిక మాధ్యమాల్లో నాపై దుష్ప్రచారం’

సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ తనను తీవ్ర అప్రతిష్ఠ పాల్జేస్తున్నారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated : 25 Feb 2024 08:57 IST

హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు వైఎస్‌ షర్మిల ఫిర్యాదు
8 మంది పేర్లతో వివరాల అందజేత.. రెండు కేసులు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ తనను తీవ్ర అప్రతిష్ఠ పాల్జేస్తున్నారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరపూరిత దురుద్దేశంతో తనను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. మహిళల ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్‌ ఛానెళ్లు.. ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టులు ఉంటున్నాయని వాపోయారు. ఈ మేరకు సైబర్‌క్రైమ్‌ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం..

నాపై అసభ్య కామెంట్లు

‘‘నేను ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల్ని కలుస్తూ ప్రచారం ప్రారంభించాను. ఈ సందర్భంగా కొందరు దురుద్దేశంతో సామాజిక మాధ్యమాల్లో నాపై.. నా సహచరులపై అసభ్య కామెంట్లు పెడుతున్నారు. ఇవన్నీ నిరాధారమైనవే అయినా నన్ను అవమానించేలా ఉన్నాయి. ‘వైఎస్‌ షర్మిల ప్రాణాలకు ప్రమాదం.. దొంగల ముఠా.. వైఎస్‌ షర్మిల క్యాంపు కార్యాలయంలో కోవర్ట్‌ ఆపరేషన్‌’ అంటూ కొన్ని పీడీఎఫ్‌ ప్రతులను సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ చేస్తున్నారు. ‘షర్మిల తన అన్నతో విభేదించి వైఎస్‌ఆర్‌.. వైఎస్‌ జగన్‌కు ఆజన్మ శత్రువైన చంద్రబాబుతో చేతులు కలిపి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోంది’ అని వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు, పోస్టులతో నా వ్యక్తిత్వాన్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోకపోతే నాకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుంది’’ అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మేదరమెట్ల కిరణ్‌కుమార్‌, రమేశ్‌ బులగాకుల, పంచ్‌ ప్రభాకర్‌(అమెరికా), ఆదిత్య(ఆస్ట్రేలియా), సత్యకుమార్‌ దాసరి(చెన్నై), సేనాని, వర్రా రవీందర్‌రెడ్డి, శ్రీరెడ్డి, మహ్మద్‌ రెహ్మత్‌ పాషా తదితర వ్యక్తులు సామాజిక మాధ్యమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును వైఎస్‌ షర్మిల భర్త అనిల్‌ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని