వారసులొచ్చారు!

తెదేపా తరఫున ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్లో పలువురు రాజకీయ నేపథ్యం గల కుటుంబాల నుంచి వచ్చిన వారున్నారు.

Updated : 25 Feb 2024 05:43 IST

ఈనాడు, అమరావతి: తెదేపా తరఫున ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్లో పలువురు రాజకీయ నేపథ్యం గల కుటుంబాల నుంచి వచ్చిన వారున్నారు. వీరిలో చాలామంది తొలిసారి ఎన్నికల బరిలో దిగుతుండగా, మరికొందరికి గతంలో పోటీచేసిన అనుభవముంది..


తొలిసారి బరిలో దిగుతున్నవారు

కొండపల్లి శ్రీనివాస్‌- గజపతినగరం: పూర్వపు బొబ్బిలి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన దివంగత కొండపల్లి పైడితల్లినాయుడు మనవడు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తెదేపా ఇన్‌ఛార్జి అప్పలనాయుడికి సోదరుడి కుమారుడు. శ్రీనివాస్‌ తండ్రి కొండలరావు గతంలో గంట్యాడ ఎంపీపీగా పనిచేశారు.

యనమల దివ్య- తుని: మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడి కుమార్తె. ఆయన వారసురాలిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కొంతకాలంగా తుని తెదేపా ఇన్‌ఛార్జిగా ఉన్నారు.

ఆదిరెడ్డి వాసు- రాజమహేంద్రవరం నగరం: మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తనయుడు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడికి సొంత బావ.

బడేటి రాధాకృష్ణ- ఏలూరు: దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) సోదరుడు. ఆయన మరణించిన తర్వాత ఏలూరు తెదేపా ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

వర్ల కుమార్‌రాజా- పామర్రు: తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తనయుడు. 2014 ఎన్నికల్లో రామయ్య పామర్రు నుంచి పోటీ చేయగా, ఈసారి ఆయన తనయుడికి అవకాశం దక్కనుంది.

నెలవల విజయశ్రీ- సూళ్లూరుపేట: మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె. తిరుపతిలో వైద్యురాలు.

రెడ్డప్పగారి మాధవి- కడప: మాజీ మంత్రి రెడ్డప్పగారి రాజగోపాల్‌రెడ్డి కోడలు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి భార్య. వారి వారసత్వంతో టికెట్‌ సంపాదించారు.

ఎస్‌.సవిత- పెనుకొండ: మాజీ మంత్రి, మాజీ ఎంపీ రామచంద్రారెడ్డి కుమార్తె. ఆ వారసత్వంతో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఎంఈ సునీల్‌కుమార్‌- మడకశిర: మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు. ఆయన వారసుడిగా అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు.


గతంలో పోటీచేసి.. మరోసారి బరిలోకి

బేబినాయన (ఆర్‌వీఎస్‌కేకే రంగరావు)- బొబ్బిలి: ఈయన మాజీ మంత్రి సుజయ్‌ కృష్ణరంగారావుకు సోదరుడు. 2014లో విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఈసారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు.

అదితి విజయలక్ష్మీ గజపతిరాజు- విజయనగరం: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నేత పూసపాటి అశోక్‌గజపతిరాజు కుమార్తె. 2019 ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ సీటుకు పోటీచేసి ఓడిపోయారు. మరోసారి అక్కడి నుంచే బరిలో దిగుతున్నారు.

కాగిత కృష్ణప్రసాద్‌-పెడన: దివంగత మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు తనయుడు. పెడన నుంచి 2019లో తెదేపా అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మరోసారి అవకాశం దక్కించుకున్నారు.

తంగిరాల సౌమ్య- నందిగామ: దివంగత మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు కుమార్తె. ఆయన మరణానంతరం 2014లో జరిగిన ఉప ఎన్నికలో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో నందిగామ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మూడోసారి బరిలో నిలుస్తున్నారు.

నారా లోకేశ్‌- మంగళగిరి: తెదేపా అధినేత చంద్రబాబు తనయుడు. రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. 2019లో మంగళగిరిలో ఓడిపోయారు. మరోసారి అక్కడి నుంచే బరిలో దిగుతున్నారు.

భూమా అఖిలప్రియ- ఆళ్లగడ్డ: దివంగత మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, శోభనాగిరెడ్డి దంపతుల కుమార్తె. 2014లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019లో ఆళ్లగడ్డ నుంచి పోటీచేసి ఓడిపోయారు. మరోసారి అక్కడి నుంచే పోటీ చేయనున్నారు.

టీజీ భరత్‌- కర్నూలు: మాజీ మంత్రి టీజీ వెంకటేశ్‌ తనయుడు. 2019లో కర్నూలు నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి అక్కడి నుంచే బరిలో నిలవనున్నారు.

కేఈ శ్యాంబాబు- పత్తికొండ: మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు. ఆయన వారసుడిగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన పత్తికొండ నుంచే మరోసారి పోటీ పడనున్నారు.

జేసీ అస్మిత్‌రెడ్డి- తాడిపత్రి: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు. 2019లో తాడిపత్రి నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికలకు మళ్లీ టికెట్‌ దక్కించుకున్నారు.

నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి- పీలేరు: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు. 2014 ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున, 2019 ఎన్నికల్లో తెదేపా తరఫున పీలేరు పోటీ చేసి ఓడిపోయారు. మూడోసారి అక్కడి నుంచే బరిలో దిగుతున్నారు.

గాలి భానుప్రకాశ్‌- నగరి: మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడి కుమారుడు. 2019లో నగరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి బరిలో దిగనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని