సింహపురిలో సీన్‌ రివర్స్‌.. ప్రకాశంలో ఎదురుగాలి

వైకాపాకు ఎదురులేని సింహపురి జిల్లా.. కంచుకోట ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ పరిస్థితులు ప్రస్తుతం తల్లకిందులయ్యాయి.

Published : 25 Feb 2024 05:11 IST

వైకాపా కంచుకోటలకు బీటలు
నెల్లూరులో పార్టీకి ఆర్థిక అండదండ ఎంపీ వేమిరెడ్డి అవుట్‌
ఇప్పటికే ఫ్యాన్‌కు దూరమైన ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌
తాజాగా జతకూడిన మరో ఎమ్మెల్యే వరప్రసాద్‌

ఈనాడు, అమరావతి: వైకాపాకు ఎదురులేని సింహపురి జిల్లా.. కంచుకోట ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ పరిస్థితులు ప్రస్తుతం తల్లకిందులయ్యాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదింటికి పది క్లీన్‌స్వీప్‌ చేసిన వైకాపాకు ప్రస్తుత పరిణామాలు క్షణమోయుగంలా కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో 12లో 8 సీట్లను కైవసం చేసుకున్న పార్టీ మరింత దిగజారింది. నెల్లూరు జిల్లాలో పార్టీని ఇప్పుడు సిట్టింగులు ఒక్కొక్కరూ ఖాళీ చేసేస్తున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తాజాగా పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీని వీడారు. ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన అధిష్ఠానం.. అనర్హత వేటు కోసం స్పీకర్‌కూ ఫిర్యాదు చేసింది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ ఇటీవల జనసేన టచ్‌లోకి వెళ్లారు. శుక్రవారం ఒంగోలులో ముఖ్యమంత్రి జగన్‌ సభకు సిటింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, సీనియర్‌ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి, మరో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, పర్చూరు వైకాపా మాజీ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్‌ దూరంగా ఉన్నారు. రెండు జిల్లాల్లోనూ పార్టీకి అండగా నిలుస్తున్న ప్రధాన సామాజికవర్గంలోనూ చీలికొచ్చింది.

ఆర్థిక దన్ను దూరం

వైకాపాకు ఆర్థికంగా దన్నుగా నిలిచిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా ఖరారు చేసినప్పటికీ ఆయన పార్టీలో మనలేక వెళ్లిపోయారు. ఆయనపైన, ఆయన భార్యపైన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు వ్యంగ్యంగా విమర్శించినా పార్టీ పెద్దలు నియంత్రించకపోగా.. సదరు ఎమ్మెల్యే అవకాశాలనూ పెంచారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయబోనన్న వేమిరెడ్డి విన్నపాలను కాదని లోక్‌సభ అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. సర్దుకుపోతున్నప్పటికీ కనీసం గుర్తించకుండా అవమానిస్తుండడంతో మనస్తాపంతో పార్టీకి గుడ్‌బై చెప్పారు.

  ఆనంను అవమానకరంగా...

నెల్లూరు నగరం, గ్రామీణం, ఆత్మకూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఆనం రాంనారాయణరెడ్డి అనుచరగణం ఉంది. 2019 ఎన్నికల ముందు వైకాపాలో చేరిన ఆనంకు వెంకటగిరి టికెట్‌నైతే ఇచ్చారు కానీ.. గెలిచాక ఎమ్మెల్యేగా ఆయనకు సముచిత ప్రాధాన్యం లభించలేదు. నియోజకవర్గంలో అభివృద్ధిపై ప్రశ్నించినందుకు వైకాపా అధిష్ఠానం ఆయన్ను పక్కనపెట్టింది. వెంటనే వెంకటగిరి పార్టీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి నియమించేశారు. చివరకు గత మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ సస్పెన్షన్‌ వేటు వేశారు.

వీరసైనికుడు కోటంరెడ్డి కోట దాటారు..

ఓదార్పుయాత్ర నుంచే జిల్లాలో జగన్‌కు వీరసైనికుడిగా నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిలిచారు. 2014, 2019లలో రెండుసార్లూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లోగానీ, 2022లోగానీ ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. పైగా నియోజకవర్గ అభివృద్ధి గురించి అధికారిక సమావేశంలో కోటంరెడ్డి ప్రశ్నించడాన్నీ పార్టీ అధిష్ఠానం తప్పుపట్టింది. తన ఫోన్‌ను ట్యాప్‌ చేయించడాన్ని ఆయన ప్రశ్నించారు. తర్వాత ఆయన్ను పార్టీ సస్పెండ్‌ చేసింది.

 నగరం ఖాళీ

నెల్లూరు నగరంలోనూ వైకాపా ఖాళీ అయింది. ఇక్కడ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్‌కుమార్‌ను పార్టీలోని ప్రధాన సామాజికవర్గం వ్యతిరేకించింది. పరిస్థితి చేయి దాటుతుండడంతో అనిల్‌ను నరసరావుపేట లోక్‌సభ స్థానానికి ముఖ్యమంత్రి మార్చేశారు. రాజీనామా చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మార్గాన్నే నగర డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌, మద్దతినిచ్చే కార్పొరేటర్లూ అనుసరిస్తున్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ముక్కాల ద్వారకానాథ్‌ పార్టీకి అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. అనిల్‌ను వ్యతిరేకించిన వీరంతా ఇప్పుడు ఆయన అనుచరుడైన ఖలీల్‌అహ్మద్‌ను నగర నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా నియమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

జిల్లాలో మరో పెద్ద కుటుంబం నల్లపురెడ్డిది. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి పార్టీలో తగిన గుర్తింపు లేదు. 2019 తర్వాత రెండుసార్లు మంత్రివర్గ ఏర్పాటులో అవకాశం దక్కలేదు.


నెల్లూరులో అస్మదీయులు దూరం

మేకపాటి కుటుంబంలో కీలకమైన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి గత ఎన్నికల్లో ఆయన సిటింగ్‌ సీటు అయినప్పటికీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీకి అవకాశమివ్వలేదు. ఆయన కోరుకున్నట్టు తితిదే ఛైర్మన్‌గా నియమిస్తారన్న ప్రచారమూ సాకారం కాలేదు. ఆయన వారసుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి జగన్‌కు అండగా ఉండేవారు. గౌతమ్‌రెడ్డి మరణానంతరం ఆ కుటుంబంనుంచి గతంలో ఉన్నంత మద్దతు వైకాపాకు లభించడం లేదు. ఇంకోవైపు ఆ కుటుంబంలోని మరో ముఖ్యుడు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వైకాపాను వీడారు. చంద్రశేఖర్‌రెడ్డి స్థానంలో ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డిని నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా నియమించారు. ఈ నియామకంతో అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టారా? అన్న చర్చ జిల్లాలో మొదలైంది.


ప్రకాశంలో పోరాటం

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఒంగోలులో తన స్థానంలో తాను కొనసాగేందుకూ బాలినేని పోరాడాల్సి వచ్చింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్టీకి దూరం జరిగారు. తమ సిటింగ్‌ స్థానాల్లో వేరేవారిని పార్టీ సమన్వయకర్తలుగా నియమించడంతో కందుకూరు, దర్శి ఎమ్మెల్యేలు మహీధర్‌రెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. సీటు విషయంలో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ డోలాయమానంలోనే ఉన్నారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుటుంబమూ క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్‌ సుధాకర్‌బాబూ జిల్లా వదలక తప్పని పరిస్థితి. మంత్రి సురేష్‌ను ఆయన సొంత నియోజకవర్గం నుంచి కొండపికి మార్చారు. కొండపిలో ఆయన్ను ఓడించేందుకు అక్కడి పార్టీ మాజీ సమన్వయకర్త మాదాసు వెంకయ్య వర్గంతోపాటు బాలినేని వర్గమూ సిద్ధమవుతోంది. మార్కాపురంలో అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని గిద్దలూరుకు మార్చారు. అక్కడున్న ఎమ్మెల్యే రాంబాబును మార్కాపురానికి మార్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని