టికెట్‌ దరఖాస్తుదారులతో నేడు, రేపు షర్మిల ముఖాముఖి

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో బుధ, గురువారాల్లో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో భేటీ కానున్నారు.

Updated : 28 Feb 2024 06:35 IST

ఈనాడు, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో బుధ, గురువారాల్లో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో భేటీ కానున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,100 మంది దరఖాస్తు చేశారు. నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లకు అర్జీలు పెట్టుకున్న వారితో షర్మిల బుధవారం ముఖాముఖీ నిర్వహిస్తారు. శ్రీకాకుళం, అరకు, ఒంగోలు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని దరఖాస్తుదారులతో గురువారం భేటీ అవుతారు. ఈ ముఖాముఖీల అనంతరం ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలన్న విషయమై ప్రాథమికంగా అంచనాకు వచ్చాక ఏఐసీసీ ఆమోదానికి పంపనున్నారు. ఆ తరువాతే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనున్నారు.

ప్రత్యేక హోదా కోసం మార్చి 1న తిరుపతిలో సభ

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ మార్చి 1న తిరుపతిలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సచిన్‌ పైలెట్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారు. రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, ఇతర సీనియర్‌ నేతలు పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని