తెదేపాలోనే కొనసాగుతా: జలీల్‌ఖాన్‌

తాను తెదేపాలోనే ఉంటానని, పార్టీ విజయానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు తెలిపారు.

Updated : 01 Mar 2024 05:33 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తాను తెదేపాలోనే ఉంటానని, పార్టీ విజయానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు తెలిపారు. విజయవాడ లోక్‌సభ ఇన్‌ఛార్జి కేశినేని చిన్నితో కలిసి గురువారం ఆయన ఉండవల్లిలో లోకేశ్‌తో భేటీ అయ్యారు.అనంతరం మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తుకు లోకేశ్‌ హామీ ఇచ్చారని వెల్లడించారు.


ఏ తప్పు చేశారని శరత్‌ను అరెస్టు చేశారు?

తెదేపా నేత వర్ల రామయ్య

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో సీఎం జగన్‌ను సంతోషపెట్టడానికే కొందరు అధికారులు పని చేస్తున్నారని, అందుకే ప్రత్తిపాటి శరత్‌ను అరెస్టు చేశారని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. ‘శరత్‌ ఏ తప్పు చేశారు? జీఎస్టీ ఎగ్గొట్టారని ఆరోపిస్తున్న కంపెనీతో అతనికి ఏ సంబంధమూ లేదు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి జగన్‌ ఇలా చేయించారు. తెదేపా తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులను భయాందోళనకు గురిచేయాలని చూస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ అధికారులు జగన్‌ తాబేదారుల్లా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా వారు తమ విధానాలను మార్చుకోవాలి’ అని వర్ల రామయ్య హెచ్చరించారు.


ప్రత్యేక హోదాను సీఎం జగన్‌ విస్మరించారు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్‌.. అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికే 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి తెదేపా అధినేత చంద్రబాబు బయటకు వచ్చారని గుర్తుచేశారు. గురువారం విజయవాడలోని దాసరి భవన్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థి, యువజన సంఘాలు ప్రత్యేక హోదా డిమాండుతో శుక్రవారం పిలుపునిచ్చిన ‘చలో ముఖ్యమంత్రి కార్యాలయం’ కార్యక్రమానికి ఆయన మద్దతు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని