జగన్‌పై ఒంటరిగానే నా పోరాటం

‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు.

Updated : 29 Mar 2024 06:47 IST

మోదీ, బాబు, పవన్‌లపై పూర్తి విశ్వాసం
నరసాపురం నుంచే బరిలో దిగొచ్చు
ఎంపీ రఘురామకృష్ణరాజు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు. వాటిని త్వరగా విచారించాలని ఒకటి, ఇన్నాళ్లూ న్యాయస్థానానికి వెళ్లకపోవడంతో బెయిల్‌ రద్దు చేయాలని మరొక పిటిషన్‌ వేశా’ అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పెదఅమిరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘ఆ రెండు పిటిషన్లు సుప్రీంకోర్టులో ఏప్రిల్‌ 1న విచారణకు రాబోతున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రజాకోర్టుల్లో ఆ ఉన్మాదిపై ఒంటరిగా  పోరాటం చేస్తున్నా. నా కేసు తప్పు అనడానికి లేదు. 3 వేలకుపైగా వాయిదాలు కోరిన మాట నిజం. అన్ని వాయిదాలు ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నమాట నిజం. ఏమవుతుందో చూద్దాం. వై.ఎస్‌ జగన్‌ ఎన్నోసార్లు నన్ను అనుకున్నది చేయలేకపోయారు. డిస్‌క్వాలిఫై చేయలేకపోయారు. చంపలేక పోయారు. చాలా విషయాల్లో ఫెయిల్‌ అయ్యారు. ఇప్పుడు టికెట్‌ విషయంలో ఫెయిల్‌ అవుతారనుకున్నా. తాత్కాలికంగా ఆయన విజయం సాధించారు. ముందుచూపుతోనే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో నేను చెప్పలేదు. భాజపా తరఫున పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. నేను ఏ పార్టీలోనూ లేను. ఆ పార్టీలూ అదే చెబుతున్నాయి.

చంద్రబాబు నాకు అన్యాయం చేయరు

ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లపై పూర్తి విశ్వాసం ఉంది. జగన్‌మోహన్‌రెడ్డిని వాళ్లు ప్రేమించరు అనేది నా ప్రగాఢ నమ్మకం. కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేయగలననే విశ్వాసం ఉంది. జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొన్న నన్ను జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు తాను చేయగలిగిన సాయం చేశారు. అంత సహాయ పడిన వ్యక్తి నాకు ఎందుకు అన్యాయం చేస్తారు. నన్ను చంపకుండా, నా పదవి పోకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు అన్యాయం చేస్తారనే ఆలోచన లేదు. మూడురోజులా, నాలుగురోజులు పడుతుందా అనేది చెప్పలేను. నాకు సీటు వచ్చే విషయంపై నా కన్నా ఎక్కువగా నా నియోజకవర్గ ప్రజలకే కాదు, రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డిని ద్వేషించే అందరికీ నమ్మకం ఉంది. భాజపా రాష్ట్ర అధిష్ఠానంతో నాకు పరిచయంగాని, సాన్నిహిత్యం గాని లేదు. దాంతోనే అంతరం వచ్చి ఉండొచ్చు. నాకు మద్దతుగా కొన్ని వేల మంది నుంచి ఫోన్లు వచ్చాయి. కూటమి నూటికి నూరుశాతం నాకు న్యాయం చేస్తుంది. అందుకు మీరంతా మద్దతుగా రావాలని కోరుతున్నా’ అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని