‘అఘాడీ’లో మూడింటిపై పీటముడి!

మహారాష్ట్రలో కాంగ్రెస్‌, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్‌ చంద్ర పవార్‌) వర్గాలతో ఏర్పడిన మహా వికాస్‌ అఘాడీ కూటమిలో అంతర్గత పోరు సాగుతోంది.

Updated : 31 Mar 2024 06:33 IST

అభ్యర్థులను ప్రకటించిన ఉద్ధవ్‌ పార్టీ
తామే పోటీ చేస్తామంటున్న కాంగ్రెస్‌
ఒక స్థానం తమకు ఇవ్వాలంటున్న ఎన్సీపీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహారాష్ట్రలో కాంగ్రెస్‌, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్‌ చంద్ర పవార్‌) వర్గాలతో ఏర్పడిన మహా వికాస్‌ అఘాడీ కూటమిలో అంతర్గత పోరు సాగుతోంది. ఒప్పందానికి విరుద్ధంగా కీలకమైన 3 స్థానాల్లో శివసేన (యూబీటీ) అభ్యర్థులను ప్రకటించడం వివాదాలకు తావిచ్చింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు శరద్‌ పవార్‌ రంగంలోకి దిగినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్రలోని 17 స్థానాలకు శివసేన (యూబీటీ) అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో సంగలీ, ముంబయి సౌత్‌ సెంట్రల్‌, భివండీ స్థానాలున్నాయి. అయితే ఈ మూడు స్థానాలను తనవద్దే ఉంచుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. భివండీలో పోటీ చేయాలని ఎన్సీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పరిష్కారం కనుగొనేందుకు ఇటీవల శరద్‌ పవార్‌ నేతృత్వంలో 3 పార్టీల ముఖ్య నేతలు సమావేశమయ్యారు.

ఉద్ధవ్‌ ఠాక్రే, పృథ్వీరాజ్‌ చవాన్‌, బాలాసాహెబ్‌ థోరట్‌ తదితరులు హాజరయ్యారు. వాటిని వదులుకునేందుకు కాంగ్రెస్‌ ససేమిరా అనడంతో తదుపరి సమావేశం సోమవారానికి వాయిదా పడింది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలున్నాయి. వీటిలో 44 స్థానాలకు మహావికాస్‌ అఘాడీ కూటమి పార్టీల మధ్య సర్దుబాటు జరిగింది. ఇందులో భాగంగా శివసేన (యూబీటీ) 19, కాంగ్రెస్‌ 16, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 సీట్లను కేటాయించారు. మిగతా నాలుగు స్థానాలపై చర్చలు జరుగుతున్నాయి. అవి సంగలీ, ముంబయి సౌత్‌ సెంట్రల్‌, భివండీ, ముంబయి వాయవ్య స్థానాలు. తాము మొత్తం 22 స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ ప్రకటించడం కూటమిలో అసంతృప్తికి కారణమవుతోంది. వివాదాస్పదమవుతున్న స్థానాల్లో అభ్యర్థుల ఖరారు అంశాన్ని కొలిక్కి తీసుకొచ్చేందుకు శరద్‌ పవార్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానంతోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది. వారి సూచన మేరకు శుక్రవారం రాత్రి కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి రమేశ్‌ అధ్యక్షతన పార్టీ అంతర్గత సమావేశం జరిగింది. ఈ భేటీలోనూ ఎలాంటి పరిష్కారం లభించలేదు. మిత్ర పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని, లేదంటే ప్రత్యర్థులకు ఇది అవకాశంగా మారుతుందని శరద్‌ పవార్‌ హితవు పలుకుతున్నారు. భివండీ స్థానాన్ని ఆశిస్తున్న ఎన్సీపీ (శరద్‌ చంద్ర పవార్‌)కి ప్రతికూలత ఎదురైతే సమస్య మరింత జటిలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని