వైకాపా ఎమ్మెల్యే కన్నబాబు సోదరుడు సహా ఆరుగురిపై కేసులు

కాకినాడ గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని కాకినాడ అర్బన్‌ రెండో డివిజన్‌ శశికాంత్‌ నగర్‌లో మంగళవారం రాత్రి భాజపా, జనసేన నాయకులపై దాడి చేసిన వైకాపా నాయకులపై పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు.

Published : 04 Apr 2024 04:10 IST

సర్పవరం జంక్షన్‌, న్యూస్‌టుడే: కాకినాడ గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని కాకినాడ అర్బన్‌ రెండో డివిజన్‌ శశికాంత్‌ నగర్‌లో మంగళవారం రాత్రి భాజపా, జనసేన నాయకులపై దాడి చేసిన వైకాపా నాయకులపై పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. శశికాంత్‌నగర్‌లోని బహుళ అంతస్తుల భవనంలో మంగళవారం రాత్రి వైకాపా ప్రచార సామగ్రిని దింపుతుండగా.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా ఇవి ఉన్నాయని భాజపా, జనసేన నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వైకాపా నాయకులు అక్కడికి చేరుకుని అసభ్య పదజాలంతో దూషిస్తూ వీరిపై దాడికి పాల్పడ్డారు. ఘటనపై భాజపా నాయకుడు కోనేటి రామకృష్ణ, జనసేన నాయకుడు తుమ్మలపల్లి నారాయణరావు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు బుధవారం ఆరుగురిపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ గ్రామీణ జడ్పీటీసీ సభ్యుడు నులుకుర్తి రామకృష్ణ (కిట్టు), కాకినాడ గ్రామీణ వైకాపా ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సోదరుడు, సినీ దర్శకుడు కల్యాణ్‌కృష్ణ, వైకాపా నాయకుడు కడియాల చిన్నబాబు, తిమ్మాపురం సర్పంచి, జేఎన్‌టీయూకే ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ, నేమాం సర్పంచి రాందేవు సూర్యప్రకాశరావు(చిన్నా)తో పాటు మరికొందరు వైకాపా నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఘటనలో జడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణ జనసేన నాయకుడు కోనేటి రామకృష్ణను తోసివేస్తుండటం.. ప్రతిపక్ష పార్టీల నాయకులపై సర్పంచి సత్యనారాయణ రాయితో దాడికి యత్నిస్తుండటం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని