రైతులపై వారిది మొసలి కన్నీరు

కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఏనాడూ పంటల బీమా పథకం అమలు చేయలేదని, పంట నష్టపరిహారం ఇవ్వలేదని ఆబ్కారీశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.

Published : 04 Apr 2024 04:34 IST

కేసీఆర్‌ ప్రభుత్వం ఏనాడూ పంట నష్టపరిహారం ఇవ్వలేదు: మంత్రి జూపల్లి

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే: కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఏనాడూ పంటల బీమా పథకం అమలు చేయలేదని, పంట నష్టపరిహారం ఇవ్వలేదని ఆబ్కారీశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. నాగర్‌కర్నూల్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబం అడ్డూ అదుపూ లేకుండా సంపదను సృష్టించుకుందని ఆరోపించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ఏనాడూ రైతుల దగ్గరికి వెళ్లలేదని.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పంట నష్టపరిహారం ఇవ్వాలని అడుగుతున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందన్నారు. వంద రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసినట్లు తెలిపారు. గతంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, ఇప్పుడు మమ్మల్ని అడిగే హక్కు వారికి లేదన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కే ఉందని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, గద్వాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరిత, ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని