ఇన్నాళ్లూ లేనిది.. ఇప్పుడు గుర్తొచ్చామా?

ఎమ్మెల్సీ అనంతబాబుకు పోలవరం ముంపు గ్రామాల్లో మరోసారి నిరసన సెగ తగిలింది.

Published : 13 Apr 2024 05:15 IST

ఎమ్మెల్సీ అనంతబాబును నిలదీసిన పోలవరం నిర్వాసితులు

దేవీపట్నం, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ అనంతబాబుకు పోలవరం ముంపు గ్రామాల్లో మరోసారి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం మూలపాడులో గురువారం సాయంత్రం ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో గ్రామానికి చెందిన గిరిజన నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కడుపు మండిపోయి ఉన్నాం. నాలుగేళ్లయింది. ఇప్పుడు గుర్తుకొచ్చామా’ అంటూ ఎమ్మెల్సీని నిలదీశారు. ఓ నిర్వాసితుడిని ‘ఓవర్‌ వద్దు’ అని ఎమ్మెల్సీ అనడంతో.. ‘ఓవర్‌ కాదండి మా సమస్యలను పట్టించుకోలేదు’ అని చెబుతున్నామంటూ ఆయన సమాధానం ఇచ్చారు. స్థానికుల నిరసన కొనసాగుతుండగానే సమావేశం కొనసాగించారు. అయితే అనంతబాబు మాట్లాడుతుండగానే అక్కడున్న వారు ఒక్కొక్కరిగా ఇళ్లకు వెళ్లిపోయారు. వారిని నిలువరించడానికి నాయకులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రజల సమస్యలను పట్టించుకోని ఈ ప్రజా ప్రతినిధులు మాకొద్దంటూ నిర్వాసితులు మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్సీ తనతో పాటు వచ్చిన ఇతర గ్రామాల వారితోనే సమావేశం నిర్వహించి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని