మునుపెన్నడూ లేనంత తక్కువగా.. 326 సీట్లలోనే కాంగ్రెస్‌ పోటీ..

దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్‌.. మునుపెన్నడూ లేనంత తక్కువగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 326 స్థానాల్లో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటివరకు 281 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Updated : 17 Apr 2024 07:37 IST

మిత్రపక్షాలతో పొత్తులే కారణం

ఈనాడు, దిల్లీ: దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్‌.. మునుపెన్నడూ లేనంత తక్కువగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 326 స్థానాల్లో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటివరకు 281 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో మూడు నియోజకవర్గాలు సహా ఇతర సీట్లకు ఇంకా ప్రకటించాల్సి ఉంది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో హస్తం పార్టీ 417 స్థానాల్లో పోటీ చేసింది. ఇన్నేళ్లూ అదే అత్యల్ప సంఖ్యగా ఉండగా, ఇప్పుడు అంతకంటే తక్కువ స్థానాలకు పరిమితమవుతోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో బలంగా ఉన్న ఎన్డీయేను ఎదుర్కోవడం ఒంటరిగా సాధ్యం కాదన్న ఉద్దేశంతో  కాంగ్రెస్‌ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో భావసారూప్య పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంది. కర్ణాటక, తెలంగాణ, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గోవా, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, సిక్కింతోపాటు 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే ఆ పార్టీ  పూర్తి స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన రాష్ట్రాల్లో   మిత్రపక్షాలతో సీట్లు పంచుకుంది.

ఆ 4 రాష్ట్రాల్లో పాతిక శాతం స్థానాల్లోనే..

ఉత్తర్‌ప్రదేశ్‌ (80), మహారాష్ట్ర (48), బిహార్‌ (40), తమిళనాడు (39)ల్లో మొత్తం 207 స్థానాలు ఉండగా.. వాటిలో కాంగ్రెస్‌ కేవలం 52 చోట్ల పోటీ చేస్తోంది. అంటే 25.12% స్థానాలకు పరిమితమైంది. మిగిలినవాటిని తన నేతృత్వంలోని ఇండియా కూటమి మిత్రపక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ, డీఎంకేలకు వదులుకుంది. 21 సీట్లున్న ఒడిశాలో ఇప్పటివరకు 17 స్థానాలకు హస్తం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన నాలుగింటిని జేఎంఎం, వామపక్షాలకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌, హరియాణాల్లో ఆప్‌తో సీట్ల సర్దుబాటు చేసుకున్న కాంగ్రెస్‌.. పంజాబ్‌లో మాత్రం అదే పార్టీతో తలపడుతోంది. పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌లలో వామపక్షాలతో పొత్తు      కుదుర్చుకుంది. కానీ కేరళలో లెఫ్ట్‌ కూటమితో హోరాహోరీ తలపడుతోంది.

ఈశాన్యంలో బలహీనంగా..!

కాంగ్రెస్‌ ప్రస్తుతం కేరళ, తెలంగాణ, కర్ణాటక, హరియాణా, మహారాష్ట్ర, పంజాబ్‌ల్లో మాత్రమే భాజపాకు బలమైన పోటీ ఇచ్చే స్థాయిలో ఉంది. యూపీ, బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లలో హస్తం పార్టీ, ఇండియా కూటమి పక్షాలు అంత గొప్ప స్థితిలో లేవని   విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని 25 స్థానాల్లో హస్తం పార్టీ బలహీనంగా ఉందన్న భావన    వ్యక్తమవుతోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో పోటీ    భాజపాకు, అక్కడి ప్రాంతీయ పార్టీలకు మధ్యే ప్రధానంగా కేంద్రీకృతమైనట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌   ఉనికి పెద్దగా లేదు. కాబట్టి 326 సీట్లలో పోటీ చేస్తున్నప్పటికీ.. కాంగ్రెస్‌ ప్రభావం కొన్ని రాష్ట్రాలకే పరిమితమని   నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని