వాల్తేరు క్లబ్లో వైకాపా డిష్యుం డిష్యుం!
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు.
అధికారం వస్తే ప్రభుత్వానికి అప్పగిస్తానన్న విజయసాయిరెడ్డి
నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తూ మీడియాతో విశాఖ అంశం ప్రస్తావన
విశాఖ బరిలో ఉన్న బొత్స ఝాన్సీకి వ్యతిరేకంగా పావులు!
ఆయన భూఅక్రమాలపై తాడేపల్లిలో ఫిర్యాదుకు బొత్స సిద్ధం
ఎవరేమన్నారంటే?
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. కమ్మ, రెడ్డి, ఇంకే సామాజికవర్గమైనా కావొచ్చు. రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమి. నాకంటూ అధికారం వస్తే తప్పకుండా ఆ భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తా.
ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలివీ
విజయసాయిరెడ్డి ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు. ఏదైనా ఉంటే వన్ టూ వన్ మాట్లాడుకోవాలి. ఇలా బహిరంగంగా మాట్లాడటం తగదు. వాల్తేరు క్లబ్ గురించి మాట్లాడటానికి ఇప్పుడేంటి సందర్భం? ఈ ముఖ్యమంత్రి, నేను ఉండగా అలాంటివి అస్సలు జరగదు. చట్టపరంగా ఏదైనా ఉంటే నగరంలో ఉన్న పెద్దల గౌరవాన్ని సీఎం తప్పనిసరిగా కాపాడతారు. ప్రభుత్వానికి చెందిందయితే దరఖాస్తు పెట్టుకుంటారు.. దాన్ని జగన్ పరిశీలించి, మిగతా క్లబ్ల తరహా ప్రకారం ఇచ్చేస్తారు. ప్రత్యేకంగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఏం ఉంది.? మేం కూడా ఉన్నాం కాబట్టి.. పెద్దలదని చెప్పి జగన్ను ఒప్పించి చేస్తాం.
ఇదీ బొత్స సత్యనారాయణ స్పందన
ఈనాడు- విశాఖపట్నం: విశాఖలోని వాల్తేరు క్లబ్పై వైకాపా రాజకీయం చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ‘అధికారంలోకి రాగానే లాగేసుకుంటాం’ అంటూ విజయసాయిరెడ్డి సవాల్ చేస్తుంటే, ‘నేను, జగన్ ఉండగా అది జరగదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ ఓటర్లను నమ్మించేందుకు తంటాలు పడుతున్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న విజయసాయిరెడ్డి తాజాగా ఓ ఛానల్ ఇంటర్య్వూలో వాల్తేరు క్లబ్పై చేసిన వ్యాఖ్యలు విశాఖ వైకాపాలో చిచ్చురేపాయి. విశాఖ ఎంపీ అభ్యర్థిగా తన సతీమణి ఝాన్సీ రేసులో ఉండటంతో మంత్రి బొత్స ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఉత్తరాంధ్రలోని అన్ని సామాజికవర్గాల ప్రముఖులు ఈ క్లబ్లో సభ్యులుగా ఉండటంతో ఎక్కడ ఎన్నికలపై ప్రభావం పడుతుందో, ఎక్కడ విజయావకాశాలు దెబ్బతింటాయోనని బొత్స ఆందోళన చెందుతున్నారు.
ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే కన్ను!
విశాఖ నగరం నడిబొడ్డున వాల్తేరు క్లబ్ సుమారు 20 ఎకరాల్లో విస్తరించి ఉంది. బ్రిటీష్ కాలంలో ఏర్పాటయిన ఈ క్లబ్లో అన్ని సామాజికవర్గాల ప్రముఖులూ సభ్యులుగా ఉన్నారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే విజయసాయిరెడ్డి ఈ భూములపై కన్నేశారు. ప్రభుత్వ రికార్డుల్లో మిగులు భూమిగా ఉందంటూ గతంలో స్వాధీనం చేసుకునేందుకు హడావుడి చేశారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో స్టే వచ్చింది. ప్రతిపక్షంలో ఉండగా క్లబ్లో సభ్యత్వం అడిగితే ఇవ్వలేదన్న అక్కసుతో విజయసాయిరెడ్డి అధికారంలోకి రాగానే కక్షసాధింపునకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయనగరం నుంచి కొందరితో వాల్తేరు క్లబ్పై సిట్కు ఫిర్యాదు చేయించినట్టు విమర్శలున్నాయి. దానివల్లే సిట్ పరిధిలో లేని క్లబ్ అంశాన్నీ అందులో చేర్చారు.
ఆ భయంతోనే కౌంటర్ ఇచ్చిన బొత్స
2014లో వైఎస్ విజయమ్మ విశాఖ ఎంపీ స్థానానికి వైకాపా తరఫున పోటీ చేశారు. ఆమెకు మద్దతుగా కడప నుంచి వచ్చిన కొందరు వాల్తేరు క్లబ్పై దౌర్జన్యాలకు దిగారు. ‘ఈ క్లబ్ ఎలా ఉంటుందో చూస్తాం’ అంటూ హల్చల్ చేశారు. దీంతో ప్రశాంతమైన విశాఖలో రౌడీమూకల అల్లర్లపై నగరవాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ ఎన్నికల్లో విజయమ్మ ఓటమికి కారణాల్లో ఇది కూడా ఒకటని వైకాపా భావించింది. ప్రస్తుత ఎన్నికల వేళ వాల్తేరు క్లబ్ వ్యవహారం మళ్లీ తెరపైకి రావడం ఝాన్సీ విజయావకాశాల్ని దెబ్బతీస్తుందేమోననే భయంతో బొత్స వెంటనే దిద్దుబాటుకు దిగారు.
‘రూ.వేల కోట్ల భూకబ్జాలు చేశానంటూ ప్రచారం చేసి నన్ను విశాఖ నుంచి దూరం చేశారు’ అంటూ విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు బొత్స ఓ సామాజికవర్గానికి నేతృత్వం వహించారు. ఈ కారణాలతో బొత్స ఝాన్సీ పోటీలో ఉండగా, సాయిరెడ్డి వ్యూహాత్మకంగానే వాల్తేరు క్లబ్ ప్రస్తావన తెచ్చి, బొత్స కుటుంబానికి వ్యతిరేకంగా పావులు కదిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని సీరియస్గా తీసుకున్న బొత్స.. విజయసాయిరెడ్డికి సంబంధించి సర్క్యూట్హౌస్, లులు మాల్కు కేటాయించిన స్థలాలు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో రాజకీయాలు, బీచ్ వెంట కబ్జాలు... ఇలా అన్ని అంశాలతో చిట్టా సిద్ధం చేస్తున్నారు. ఆ చిట్టాతో తాడేపల్లిలో జగన్ వద్ద పంచాయితీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం మేడే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.