వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు

Published : 20 Apr 2024 05:32 IST

వాటిలో రెండు హత్యాయత్నం కేసులు
సీఐడీ నమోదు చేసిన కేసులు 8
నామినేషన్‌తోపాటు సమర్పించిన అఫిడవిట్‌లో వెల్లడి

ఈనాడు, చిత్తూరు: వైకాపా ప్రభుత్వం తెదేపా అధినేత చంద్రబాబుపై ఏకంగా 22 కేసులు నమోదు చేసింది. 2019కు ముందు ఆయనపై కేవలం రెండు కేసులుండగా ఈ అయిదేళ్లలో ఏకంగా 22 కేసులు పెట్టారు. వాటిలో మంగళగిరిలోని సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో పెట్టిన కేసులే 8 ఉన్నాయి. చంద్రబాబుపై అన్నమయ్య, తూర్పుగోదావరి, ఎన్టీఆర్‌ జిల్లాల్లో రెండేసి చొప్పున, అనంతపురం, గుంటూరు, పల్నాడు, కర్నూలు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, విశాఖ, నంద్యాల జిల్లాలతోపాటు మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున కేసులున్నాయి. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి శుక్రవారం నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన ప్రమాణపత్రంలో ఈ వివరాలున్నాయి.

  • మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో చంద్రబాబుపై రెండు కేసులు నమోదు చేశారు. కురబలకోట మండలం అంగళ్లులో గతేడాది ఆగస్టులో తెదేపా కార్యకర్తలను వైకాపా శ్రేణులు రెచ్చగొట్టినప్పటికీ తిరిగి ప్రతిపక్ష పార్టీపైనే కేసులు పెట్టారు. చంద్రబాబు హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ ఎఫ్‌ఐఆర్‌ కట్టారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో విజయసాయిరెడ్డి వాహనంపై తెదేపా శ్రేణులు రాళ్లు, నీళ్ల సీసాలు, చెప్పులు విసిరి అద్దాలు పగలగొట్టి చంపబోయారంటూ మరో హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
  • 2010లో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ధర్మాబాద్‌ పోలీసులు ఒక కేసు నమోదు చేశారు.
  • 2012లో ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారని కేసు పెట్టారు.
  • జగన్‌ అధికారంలోకి వచ్చాక 2020లో 5, 2021లో 9, 2022లో 2, 2023లో 6 కేసులు పెట్టారు. వాటిలో మంగళగిరిలోని సీఐడీ పోలీస్‌స్టేషన్‌లో 2023లో రెండు, 2022లో ఒకటి, 2021లో మూడు, 2020లో రెండు మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. ఉచిత ఇసుక పాలసీలో తీసుకున్న విధానపరమైన నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారని, ప్రివిలేజ్‌ ఫీజు, డిస్టిలరీలు, వివిధ మద్యం బ్రాండ్లకు అనుమతులిస్తూ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ఆదాయానికి నష్టం వాటిల్లిందని, సీఆర్‌డీఏ, రాజధాని, ఇన్నర్‌ రింగు రోడ్డు మాస్టర్‌ప్లాన్‌ నిర్ణయాల్లో అవకతవకలకు పాల్పడి కొందరికి అనుచితంగా లబ్ధి చేకూర్చారని కేసులు పెట్టారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ ఫైబర్‌నెట్‌, ఎసైన్డ్‌ భూములు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపైనా సీఐడీ కేసులు నమోదు చేసింది.  
  • కొవిడ్‌ రెండో దశలో 440కే వేరియంట్‌ గురించి ప్రసార, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడి ప్రజల్లో భయాందోళన కలిగించారంటూ గుంటూరు నగరం అరండల్‌పేట, పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ, కర్నూలు ఒకటో పట్టణ స్టేషన్లలోనూ చంద్రబాబుపై కేసులు పెట్టారు. కొవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులో లేవని ఆయన చెప్పినందుకు విజయవాడలోని సూర్యారావుపేట ఠాణాలో ఒక కేసు నమోదు చేశారు.

కేసులు మూసేసినప్పటికీ ముందు జాగ్రత్తగా..

తిరుపతి జిల్లా ఏర్పేడులో ముందస్తు అరెస్టు, విశాఖలోని ఎయిర్‌పోర్ట్‌ స్టేషన్‌లో ముందస్తు అరెస్టు, విజయవాడ పటమట ఠాణాలోని ముందస్తు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న సందర్భంలో కాన్వాయ్‌ ఆపి కారు దిగి కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినట్టు నందిగామ స్టేషన్‌లో నమోదైన కేసుల్లో ఆయన పాత్ర రుజువు కాలేదని పేర్కొంటూ పోలీసులు కేసులు మూసేశారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా చంద్రబాబు వాటిని అఫిడవిట్‌లో ప్రస్తావించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి ఉష శ్రీచరణ్‌ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌లో చిక్కుకుని ఆసుపత్రికి వెళుతున్న ఓ చిన్నారి మృతి చెందారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని కళ్యాణదుర్గం ఠాణాలో కేసు పెట్టారు.


చంద్రబాబు ఆస్తులు రూ.36.36 కోట్లు

  • చరాస్తులు: రూ.4.80 లక్షలు. వీటిలో ఏపీ9జీ393 నంబరు అంబాసిడర్‌ కారు విలువ రూ.2,22,500. బంగారం లేదు.
  • స్థిరాస్తులు: రూ.36.31 కోట్లున్నాయి.
  • అప్పులు: కుమారుడు లోకేశ్‌తో కలిసి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి రూ.3.48 కోట్లు ఇంటి రుణం తీసుకున్నారు. ఇది ఒక్కటే చంద్రబాబుకున్న అప్పు.

భార్య భువనేశ్వరి ఆస్తులు రూ.895 కోట్లు

  • చరాస్తులు: రూ.810.37 కోట్లు. ఇందులో హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌లోని 2,26,11,525 షేర్ల విలువ రూ.763.93 కోట్లు. బంగారం, ఇతర ఆభరణాలు కలిపి రూ.1.40 కోట్లు.
  • స్థిరాస్తులు: రూ.85.10 కోట్లు
  • అప్పులు: రూ.6.83 కోట్లు. ఇందులో కుమారుడు లోకేశ్‌ నుంచి రూ.1.27 కోట్లు తీసుకోవడం గమనార్హం.
  • ఆదాయపన్ను శాఖ నుంచి రూ.6,04,900 డిమాండ్‌ నోటీసుపై వివాదం ఉంది. భువనేశ్వరి పేరుపై కారు లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని