వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు

పోలింగ్‌ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి.

Updated : 19 May 2024 05:35 IST

ఓటర్లకు పంచకుండా కొందరు కాజేశారంటూ ఆరోపణలు

ఈనాడు డిజిటల్, అమరావతి: పోలింగ్‌ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. నాని ఇచ్చిన డబ్బును కొందరు ఓటర్లకు పంచకుండా తమ వద్దే ఉంచుకొని జల్సాలు చేయడానికి, విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారంటూ తాజాగా వైకాపాకు చెందిన మైనారిటీ నాయకుడు సర్దార్‌బేగ్‌ విడుదల చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియోలో సర్దార్‌ బేగ్‌ మాట్లాడుతూ.. ‘ఈ నెల 13న ఎన్నికల నేపథ్యంలో కొడాలి నాని ఓటర్లకు ఇచ్చేందుకు తీసుకొచ్చిన డబ్బును వార్డుల్లో పంచాల్సిన నాయకులు కొందరు తినేశారు. చిన్ని గారూ (కొడాలి నాని తమ్ముడు) ఆ డబ్బులు కాజేసిన వారందరినీ కల్యాణమండపానికి (కె.కన్వెన్షన్‌కు) పిలిచి నిలదీయండి. నిజం చెప్పిన వారిని వదిలేసి డబ్బు వసూలు చేయండి. ఇవ్వని వారిపైకి మీ పెంపుడు కుక్కలన్నింటినీ వదిలేయండి. నమ్మక ద్రోహం చేసిన వారిలో 10, 11, 12వ వార్డుల్లోని వారున్నారు.

చిన్ని అన్నా.. మీరు వేగంగా వారిని పిలిచి డబ్బులు వసూలు చేయండి. లేదంటే ఒకరు గోవా, మరొకరు సింగపూర్, మలేషియా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకూ పనికిరానోడి వద్ద కూడా రూ.50 వేల కట్టలు కనిపిస్తున్నాయి. నాని గెలుపు కోసం కష్టపడిన మా కుర్రోళ్లను తిన్నారా? లేదా? అని అడిగినవారు లేరు. కనీసం బేటాలు ఇవ్వలేదు. మేము సొంత డబ్బును పార్టీ కోసం ఖర్చుపెట్టాం. మీ వద్ద డబ్బులు నొక్కేసినవారిని మాత్రం వదలొద్దు. నా పిల్లలపై ప్రమాణం చేసి చెబుతున్నా. మాకు అలాంటివేమీ తెలియవు..’ అంటూ వీడియోలో చిన్నికి సూచించారు. తామిచ్చిన డబ్బును ఎవరు పంచారు? ఎవరు నొక్కేశారన్న వివరాలను కొడాలి వర్గం తాజాగా సేకరిస్తున్నట్టు తెలిసింది. తమను మాత్రమే నిలదీసి, నిజంగా డబ్బు తినేసిన వాళ్లను వదిలేస్తారా? అని ప్రశ్నిస్తూ సర్దార్‌బేగ్‌ లాంటివారు కొడాలి నాని, చిన్నిలకు పంపిన సందేశాలు వైరల్‌ అవుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని