అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు

ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్‌ఖండ్‌లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం.

Updated : 19 May 2024 05:56 IST

ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్‌ఖండ్‌లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. పాక్‌ ఏదైనా తప్పుచేస్తే ఇక్కడి ఫిరంగి గుళ్లు వెళ్లి విధ్వంసం చేస్తాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మనదే. దానిని మనం స్వాధీనం చేసుకుంటాం. రాహుల్‌బాబా ఈ దేశాన్ని నడపాలంటే ఇదేమీ కిరాణా కొట్టుకాదు. భారత్‌ను నడపడానికి 56 అంగుళాల ఛాతీ ఉన్న బలమైన నేత ప్రధానిగా ఉండాలి.

 యూపీలోని లలిత్‌పుర్‌ సభలో అమిత్‌షా


కాంగ్రెస్‌ అధికారంలోకి రావడాన్ని రామ్‌లల్లా అనుమతించడు

అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ కలలుగంటున్నా రామ్‌లల్లా మాత్రం దానికి అనుమతించడు. ఎందుకంటే అధికారంలోకి వస్తే వారు రామాలయాన్ని నాశనం చేస్తామని చెబుతున్నారు. మోదీకి మూడోసారి ఓటువేస్తే కాంగ్రెస్, దాని మిత్రపక్షాల్లో ప్రవేశించిన ఔరంగజేబు ఆత్మను నాశనం చేస్తాం. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను ఆరునెలల్లో స్వాధీనం చేసుకుంటాం.. యూపీలో రోడ్లపై ఇప్పుడు నమాజ్‌లు లేవు. మసీదులపై లౌడ్‌ స్పీకర్లను తొలగించాం. 

 మహారాష్ట్ర సభల్లో యూపీ సీఎం యోగి 


పదేళ్లలో రాజకీయ సంస్కృతి మారింది 

విభజించు-పాలించు విధానం నుంచి పురోగతి నివేదిక సమర్పించేలా ప్రధాని మోదీ గత పదేళ్లలో దేశ రాజకీయ సంస్కృతిని మార్చారు. దీని ప్రకారం ప్రజాప్రతినిధులు తమ పనితీరును రుజువు చేసుకోవాల్సిందే. ఇండియా కూటమి వంశపారంపర్య రాజకీయాలకు సంబంధించినది. ఎన్నికలు జూన్‌ 1న ముగియగానే అవినీతి నేతలంతా మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే.

 కాంగ్రా సభలో భాజపా అధ్యక్షుడు నడ్డా 


భాజపా దళం 4 తర్వాత కనుమరుగే 

జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక భాజపా దళమంతా కనుమరుగు అవుతుంది. ఆ రోజు భాజపా సర్కారు.. కేంద్రాన్ని వీడుతుంది. 400+ సీట్లు అంటే అర్థమేమిటో ప్రజలు ఈపాటికే గ్రహించారు. ఇండియా కూటమి ముక్కచెక్కలవుతుందన్న ప్రధాని అంచనా విఫలమవుతుంది. భాజపా రథం కుప్పకూలుతుంది. 

యూపీలోని బల్‌రాంపుర్‌ సభలో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌


రాహుల్‌ చూపిస్తున్నది 

చైనా రాజ్యాంగం 

ఎన్నికల సభల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత రాజ్యాంగాన్ని కాకుండా చైనా రాజ్యాంగాన్ని చూపిస్తున్నారు. అసలైన చైనా రాజ్యాంగ పుస్తకానికి ఉన్నమాదిరి ఎర్రరంగు కవర్‌ దానికి ఉంది. మన పుస్తకం నీలిరంగు కవర్‌తో ఉంటుంది. దేశానికి మదర్సాలు అక్కర్లేదు. డాక్టర్లను, ఇంజినీర్లను తయారుచేసే కళాశాలలు కావాలి. 

 బిహార్‌ సభల్లో అస్సాం సీఎం హిమంత 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని