ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

సీఐని బెదిరించి, ఆయన విధులకు ఆటంకం కలిగించినందుకు వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది పురపాలిక వైస్‌ఛైర్మన్‌ బంగారు మునిరెడ్డి, తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యకేసు నిందితుడు కుండా రవితో పాటు మరొకరిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.

Published : 20 May 2024 04:19 IST

కడప, న్యూస్‌టుడే: సీఐని బెదిరించి, ఆయన విధులకు ఆటంకం కలిగించినందుకు వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది పురపాలిక వైస్‌ఛైర్మన్‌ బంగారు మునిరెడ్డి, తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యకేసు నిందితుడు కుండా రవితో పాటు మరొకరిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ప్రొద్దుటూరులో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు వరకు అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యల్లో శనివారం ఒకటో పట్టణ ఠాణాలో కొందరికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అందులో రామేశ్వరం వీధికి చెందిన వైకాపా కార్యకర్త నవీన్‌కుమార్‌రెడ్డిని కూడా పిలిచారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, మునిరెడ్డి తమ అనుచరులతో కలిసి స్టేషన్‌కు వెళ్లి, తమ పార్టీ కార్యకర్తను కౌన్సెలింగ్‌కు ఎలా పిలుస్తారంటూ సీఐని నిలదీశారు. ఆయన విధులకు ఆటంకం కలిగించారు. అక్కడే ఉన్న నవీన్‌కుమార్‌రెడ్డిని బలవంతంగా తమవెంట తీసుకెళ్లారు. దీంతో తనను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించిన ఎమ్మెల్యే, వారి అనుచరులపై చర్యలు తీసుకోవాలని సీఐ శ్రీకాంత్‌ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు ఒకటో ఠాణా పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని