బెంగాల్లో కాంగ్రెస్‌ కార్యాలయం ఎదుట పార్టీ అధ్యక్షుడు ఖర్గే పోస్టర్ల చెరిపివేత

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం ఎదుట ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పోస్టర్లను, హోర్డింగ్‌లను దుండగులు చెరిపి వేశారు.

Published : 20 May 2024 05:03 IST

 అధీర్‌ రంజన్‌పై వ్యాఖ్యల నేపథ్యంలో ఘటన

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం ఎదుట ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పోస్టర్లను, హోర్డింగ్‌లను దుండగులు చెరిపి వేశారు. వాటిపై సిరా పోయడంతో పాటు ‘తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏజెంట్‌’ అని రాయడం కలకలం సృష్టించింది. ఇండియా కూటమి ప్రభుత్వానికి మద్దతిస్తామన్న టీఎంసీ ఛైర్‌పర్సన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాటల్ని విశ్వసించలేమంటూ బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడు అధీర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యలను ఖర్గే తోసిపుచ్చిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. ‘కూటమిలో టీఎంసీ ఉండాలో లేదో తేల్చేది అధీర్‌ కాదు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నేను, అధిష్ఠానం నిర్ణయిస్తాం. అది ఇష్టం లేనివారు బయటకు వెళ్లిపోవచ్చు’ అని ఖర్గే శనివారం ముంబయిలో అన్నారు. అయితే, ఖర్గే పోస్టర్లు, హోర్డింగ్‌ల చెరిపివేత టీఎంసీ పనేనని, కాంగ్రెస్‌ నేతల మధ్య విభేదాలు సృష్టించే కుట్రగా అధీర్‌ రంజన్‌ అభివర్ణించారు. ఆదివారం బహరాంపుర్‌లో ఉన్న అధీర్‌...ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు సూచించడంతో పాటు పాడైన పోస్టర్లు, హోర్డింగ్‌లను తొలగించాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని