సీఎంపై ఫిర్యాదును విచారణకు చేపట్టేలా కింది కోర్టును ఆదేశించండి

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్‌ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని.. వాటిపై ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదుపై నాంపల్లి స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు వెంటనే విచారణ జరిపేలా చూడాలంటూ భాజపా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

Published : 24 May 2024 03:59 IST

హైకోర్టును ఆశ్రయించిన భాజపా 

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్‌ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని.. వాటిపై ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదుపై నాంపల్లి స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు వెంటనే విచారణ జరిపేలా చూడాలంటూ భాజపా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రైవేటు ఫిర్యాదుపై అక్కడ విచారణ జరిపి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్‌ చేస్తూ భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మే 4న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భాజపాపై నిరాధార ఆరోపణలు చేసి ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా ప్రసంగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. భాజపాకు 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ ఆరోపణలు చేసి పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశారన్నారు. రేవంత్‌రెడ్డిపై ఈ నెల 14న ఫిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై మేజిస్ట్రేట్‌ బుధవారం చేపట్టిన విచారణకు ఫిర్యాదుదారు హాజరుకాలేదని.. కొద్దిసేపు వాయిదా వేయాలని ఆయన తరఫు న్యాయవాది కోరారన్నారు. మేజిస్ట్రేట్‌.. ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చి జులై 6వ తేదీకి వాయిదా వేశారని పేర్కొన్నారు. ఫిర్యాదుదారు వాంగ్మూలాన్ని నమోదు చేసి విచారణ చేపట్టేలా ఆదేశించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు