బహుళజాతి కంపెనీల కోసమే పనిచేస్తున్న భాజపా: భట్టి

దేశ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తోంటే.. భాజపా మాత్రం బహుళజాతి కంపెనీల కోసమే పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క విమర్శించారు.

Published : 24 May 2024 04:00 IST

ఫరీద్‌కోట్‌లో భట్టివిక్రమార్కకు జ్ఞాపిక బహూకరిస్తున్న స్థానిక నాయకులు

హైదరాబాద్, న్యూస్‌టుడే: దేశ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తోంటే.. భాజపా మాత్రం బహుళజాతి కంపెనీల కోసమే పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క విమర్శించారు. గురువారం పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వనరులు, సంపద ప్రజలకే చెందాలని కాంగ్రెస్‌ పోరాటం చేస్తోందన్నారు. దేశంలోని ఆస్తులను కొద్దిమందికే కట్టబెట్టాలని మోదీ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఇండియా కూటమి పోరాటం చేస్తుండగా.. జాతి, మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని భాజపా ప్రయత్నిస్తోందన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని, సంపద పంచాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేస్తున్నారని.. మరోవైపు, బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు భాజపా కుట్రలు చేస్తోందని భట్టి ఆరోపించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా అర్హులైన ప్రతి కుటుంబంలోని ఓ మహిళ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష నగదు జమ చేస్తామని పేర్కొన్నారు. అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేస్తామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని