లండన్‌లో విహరిస్తున్న జగన్‌కు ఆడబిడ్డల ఆర్తనాదాలు పట్టవా?

‘లండన్‌లో పొర్లు దండాల మధ్య విహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కి రాష్ట్రంలో మహిళల ఆర్తనాదాలు, హాహాకారాలు  వినపడవా?’ అని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.

Published : 25 May 2024 04:24 IST

ఏలూరు అత్యాచార ఘటనపై స్పందించిన షర్మిల

ఈనాడు, అమరావతి: ‘లండన్‌లో పొర్లు దండాల మధ్య విహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కి రాష్ట్రంలో మహిళల ఆర్తనాదాలు, హాహాకారాలు  వినపడవా?’ అని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. జగన్‌ పాలనలో మహిళల భద్రతపై దేశమంతా చర్చించుకుంటోందని ఆమె విమర్శించారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో పదో తరగతి విద్యార్థినిపై సహ విద్యార్థి అత్యాచారం చేసిన ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా షర్మిల శుక్రవారం స్పందించారు. ఇందుకు సంబంధించి ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను ఆమె   జత చేశారు. ‘మీ పాలనలో మహిళల భద్రతకు, బతుకులకు పట్టిన పీడపై దేశమంతా చర్చ జరుగుతోంది. నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు,    నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి...మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్‌ ప్రేమలూ చూపించే ముఖ్యమంత్రి గారూ...పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అత్యాచారంపై మీరు, మీ మహిళా మంత్రులు, నాయకులు సిగ్గుతో తలవంచుకుంటారో, సిగ్గులేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రానికి అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు’ అంటూ ప్రభుత్వ తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని